వరంగల్, మే 17(నమస్తేతెలంగాణ) : సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన సడక్లకు స్వరాష్ట్రంలో మహర్దశ వచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత గతుకులతో ప్రయాణికులకు చుక్కలు చూపిన రోడ్ల రూపురేఖలు మారిపోయాయి. అధ్వానంగా ఉన్న రహదారుల స్థానంలో కొత్త రోడ్లు వెలిశాయి. సింగిల్ రోడ్లు డబుల్గా మారాయి. డబుల్ రహదారులు ఫోర్లేన్లుగా అవతరించాయి. వాగులు, ఒర్రెలు, కాల్వలపై వంతెనల నిర్మాణం జరిగింది. ఫలితంగా రహదారులపై వాహనాలు రయ్మంటూ పరుగెడుతున్నాయి. వాహనాల సగటు వేగం గణనీయంగా పెరిగింది. గంటకు 34కి.మీ నుంచి 68కి.మీ వరకు చేరింది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించడానికి ముందు జిల్లాలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంది. గ్రామాలు, పట్టణాల్లో ఇంటర్నల్ రహదారులు ఉండేవి కాదు. ఒక గ్రామం నుంచి మరో గ్రామం మధ్యా ఇదే పరిస్థితి. కొన్ని గ్రామాలను కలుపుతూ సింగిల్రోడ్లు ఉన్నా వాటికీ మరమ్మతులు జరిగేవి కాదు. గుంతలు ఏర్పడడం వల్ల సింగిల్ రోడ్లపై వాహనాలు సర్కస్ చేసేవి. గతుకులకు తోడు కంకర ఆరబోసినట్లు ఉండటంతో గమ్యం చేరడానికి ప్రయాణికులకు నరకం కనబడేది. వరంగల్- నర్సంపేట వంటి ప్రధాన రహదారిపై కూడా అడుగడుగునా గుంతలు ఉండేవి. దీంతో ఈ రోడ్డుపై ప్రమాదాలు జరిగేవి. గతుకుల రోడ్ల వల్ల వాహనాల వేగం తగ్గడంతో ప్రయాణికులు నిర్దేశిత సమయానికి తమ గమ్యం చేరుకోలేక పోయేవారు. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను కంట తడిపెట్టిస్తున్న సడక్లపై దృష్టి సారించింది. 2014 నుంచి రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది.
రోడ్ల అభివృద్ధికి రూ.1,013 కోట్లు..
జిల్లాలో రహదారుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం 2014 నుంచి సుమారు రూ.1,013 కోట్లు మంజూరు చేసింది. 505 కి.మీ రహదారుల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించింది. రహదారులు, భవనాల శాఖ ద్వారా రూ.395 కోట్లతో 227 కి.మీ, పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా రూ.618 కోట్లతో 278 కి.మీ రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టింది. గ్రామాలు, పట్టణాల్లో ఇంటర్నల్ రహదారులు, కనెక్టివిటీ కోసం ఒక గ్రామం నుంచి మరో గ్రామం వరకు, ఒక రోడ్డు నుంచి మరో రోడ్డు వరకు లింక్ రోడ్లు నిర్మించింది. సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి చేసింది. ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు డబుల్ రోడ్లు నిర్మించింది. మహ్మద్గౌస్పల్లి నుంచి గిర్నిబావి, ఊకల్ నుంచి తీగరాజుపల్లి, పర్వతగిరి, అన్నారంషరీఫ్ మీదుగా తొర్రూరు, రంగశాయిపేట నుంచి ఏనుగల్, చింతనెక్కొండ మీదుగా నెక్కొండ, ఉప్పరపల్లి నుంచి పర్వతగిరి వరకు ఉన్న రోడ్లను డబుల్గా మార్చింది. మహ్మద్గౌస్పల్లి-గిర్నిబావి రోడ్డులో వాగులపై, కట్య్రాల-కొత్తపల్లి రోడ్డులో ఆకేరు వాగుపై, కొత్తూరు-కల్లెడ రహదారిలో రోళ్లకల్ వాగుపై, పాకాల నుంచి అశోక్నగర్ మీదుగా పెద్దమ్మగడ్డ వరకు గల రోడ్డులోని వాగుపై వంతెనలు, కల్వర్టుల నిర్మాణం జరిగింది. ప్రస్తుతం జిల్లాలోని గ్రామాలు, పట్టణాల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులు ఇంకా కొనసాగుతున్నాయి. మెటల్ రోడ్లు బీటీ రోడ్లుగా అభివృద్ధి చెందాయి. గుంతలు పడిన బీటీ రోడ్లను తిరిగి బీటీతో రెన్యువల్ చేసే పనులు చకచకా జరుగుతున్నాయి. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న రహదారులు, వంతెనల అభివృద్ధి పనులకూ ప్రభుత్వం పెద్ద మొత్తంలో నిధులు కేటాయించింది.
పెరిగిన వాహనాల వేగం
రోడ్లు అభివృద్ధి చెందడంతో జిల్లాలో రహదారులపై వాహనాల వేగం పెరిగింది. 2014 ముందు జిల్లాలోని రహదారులపై గంటకు వాహనాల సగటు వేగం కేవలం 34 కి.మీ మాత్రమే ఉండేది. ఇప్పుడిది 68కి.మీ ఎగబాకడం విశేషం. వివిధ ఇంజినీరింగ్ విభాగాల సర్వే ప్రకారం జిల్లాలో గంటకు వాహనాల వేగం వరంగల్ నగరంలో 25 నుంచి 30, గ్రామాల్లోని ఇంటర్నల్ రోడ్లపై 40, మెయిన్ రోడ్లపై 60, హైవేలపై 80 నుంచి 90 కి.మీ నమోదైంది. ఈ లెక్కన జిల్లాలో గంటకు వాహనాల సగటు వేగం 68కి.మీగా అధికారులు గుర్తించారు. హైవేల కనెక్టివిటీ కోసం జిల్లాలో కొన్ని సింగిల్ రోడ్లను డబుల్ రోడ్లుగా అభివృద్ధి, వాగులపై హైలెవల్ వంతెనల నిర్మాణం జరుగుతున్నందున మరో కొద్ది నెలల్లో వాహనాల సగటు వేగం 70కి.మీ దాటే అవకాశం ఉంది.