ఏటూరునాగారం, జనవరి 20 : ములుగు, ఏటూరునాగారం అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని, ఈవిషయం తనకు సీఎం చెప్పారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. స్థానిక టీఆర్ఎస్ నాయకుడు కాకులమర్రి లక్ష్మీనర్సింహారావు ఇంటి వద్ద శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వెనుకబడి ఉన్న ములుగును గుర్తించింది ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని మంత్రి పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చేసినపుప్పుడు ఏటూరునాగారం, ములుగు ప్రజలు బాధపడ్డారని, గతంలో వరంగల్కు వెళ్లడం కష్టంగా ఉండేదని, ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టిపెట్టి ములుగును జిల్లా ప్రకటించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం, మెడికల్, నర్సింగ్ కాలేజీలు సిద్ధం అవుతున్నాయన్నారు. ములుగును మున్పిపాలిటీగా చేశామన్నారు.
ఏటూరునాగారం కూడా పేరు పొందిందేనని, గతంలో ఎవరూ పట్టించుకోలేదని, ఏటూరునాగారం అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిధులు కేటాయించిదని వివరించారు. సీఎం కూడా ఇటీవల ఏటూరునాగారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పినటు తెలిపారు. ములుగులో బస్సుడిపో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఏటూరునాగారంలో బస్ డిపో ఏర్పాటు చేయాలని ఇక్కడి ప్రజలు కోరుతున్నారని, ఈ విషయం సీఎం దృష్టికి తీసుకపోనున్నట్లు మంత్రి తెలిపారు. ఏటూరునాగారంలో డ్రైనేజీ సరిగా లేదని అధికారులు బాగా నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఏటూరునాగారంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు సక్రమంగా లేవని ప్రజా ప్రతినిధులు తన దృష్టికి తెచ్చారన్నారు. గతంలో సీఎం కూడా సూచన చేసిన మేరకు ఏటూరునాగారం మండల కేంద్రం అభివృద్ధికి అవసరమైన నిధులు రూ. 1 కోటి నుంచి రూ. 2కోట్ల వరకు వారం రోజుల్లో మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ప్రకటించారు. దీంతో ఏటూరునాగారం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మల్లికార్జున్ కుటుంబానికి అండగా ఉంటాం
గోవిందరావుపేట : తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు గజ్జి మల్లికార్జున్ మృతి పార్టీకి తీరని లోటు, ఆయన కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బాధిత కుటుంబాన్ని మంత్రి దయాకర్రావుతో పాటు ములుగు జడ్పీచైర్మన్ కుసుమ జగదీశ్వర్ పరామర్శించారు. అంతకు ముందు మల్లికార్జున్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.