బండ్లగూడ, ఆగస్టు 16: దొంగిలించిన పట్టు చీరతో ఫంక్షన్కు వచ్చి ఓ మహిళ దొరికిపోయింది. మూడేండ్ల కిందట జరిగిన ఓ ఇంటి దొంగతనం కేసు అనుహ్యంగా పట్టు చీరతో ఛేదించడం ఆసక్తికరంగా మారింది. పట్టు చీర దొంగిలించిన మహిళ అదే చీర కట్టుకుని ఓ వేడుకకు హాజరు కావడంతో బాధిత యజమాని గుర్తించి పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఆ కేసును రీ ఓపన్ చేసి చోరీ చేసిన దంపతులను అదుపులోకి తీసుకొని విచారించగా, అసలు నిజం ఒప్పుకొన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బండ్లగూడ వినాయకనగర్ కాలనీలో నివాసం ఉండే యాదయ్య 2023 సెప్టెంబర్ 16న తమ పిల్లలకు ఆనారోగ్యం కారణంగా మాదాపూర్లోని ఆస్పత్రిలో చేర్చించారు.దీంతో వారు ఇంటికి తాళం వేసి ఆస్పత్రి వద్ద ఉంటూ చికిత్స చేయిస్తున్నారు. కాగా, సెప్టెంబర్ 19న యాదయ్య ఆస్పత్రి నుంచి తిరిగి ఇంటికి వచ్చారు. ఇంట్లోని వస్తువులు చిందర వందరగా పడి ఉండటంతో అల్మారా తెరిచి చేసే సరికి అందులో ఉన్న రెండున్నర లక్షల నగదుతో పాటు తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు, పట్టు చీరలతో సహా విలువైన వస్తువులను దొంగలించినట్లు యాదయ్య గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసిన్పటికీ ఆధారాలు లభించక పోవడంతో దర్యాప్తు నిలిపి వేశారు.
ఇదిలా ఉంటే యాదయ్య కుటుంబానికి చెందిన ఓ వేడుకకు పక్కింటి మహిళ పట్టు చీర కట్టుకుని హాజరయింది. దీంతో యాదయ్య భార్య గుర్తించి అది తమ ఇంట్లో దొంగతనానికి గురైన చీర అని పోలీసులకు సమాచారం అందించింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితురాలితో పాటు ఆమె భర్త బుగ్గ రాములును అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో వారు చేసిన దొంగతనం విషయాన్ని బయట పెట్టారు. యాదయ్య ఇంట్లో లేని సమయంలో రాములు దంపతులు రెండో తాళం చెవిని ఉపయోగించి ఇంట్లో దొంగతనానికి పాల్పడినట్లు విచారణలో తెలిపారు.దీంతో పోలీసులు నిందితుల నుంచి 8.7 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.