కాజీపేట, జనవరి 24: కాజీపేట రైల్వే పాలిక్లినిక్ దవాఖానను భవిష్యత్లో మరింత ఉన్నతీకరిస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్ అన్నారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో ఆయనతోపాటు దక్షిణ మధ్య రైల్వే, సికింద్రాబాద్ రైల్వే డివిజన్ ఉన్నతాధికారులకు స్థానిక అధికారులు బుధవారం ఘనస్వాగతం పలికారు. రైల్వే ప్లాట్ఫారం, జంక్షన్ సర్క్యులేటింగ్ ఏరియాలో కొనసాగుతున్న అమృత్ అభివృద్ధి పనులు, రన్నింగ్ రూం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైల్వే జంక్షన్ పరిధిలోని ఫిట్లైన్, క్రూ లాబీలను తనిఖీ చేశారు. అంతకుముందు రైల్వే పాలిక్లినిక్ దవాఖాన ఆవరణలో సుమారు రూ.2.5కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు గదులను ప్రారంభించారు. రైల్వే వైద్యులతో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆయన మాట్లాడుతూ రైల్వే కార్మికులకు మెరుగైన వైద్యసేవలు అందించడమే లక్ష్యమన్నారు. రూ. 20కోట్ల అమృత్ నిధులతో అధునాతన సౌకర్యాలు, హంగులతో కాజీపేట రైల్వే జంక్షన్ను విమానాశ్రయం తరహాలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. కాజీపేట జంక్షన్ పరిధి వివిధ కార్యాలయాల్లో విధులు అధికారులు, సిబ్బంది పనితీరు బాగుందని నగదు ప్రోత్సాహక బహుమతులను ప్రకటించారు. కాజీపేట రైల్వే జంక్షన్ త్వరలోనే డివిజన్ స్థాయి గుర్తింపు పొందుతుందని రైల్వే ఉన్నతాధికారులతో పేర్కొన్నారు. సికింద్రాబాద్ రైల్వే డివిజన్ డీఆర్ఎం భరతేష్ కుమార్ జైన్, పీసీఎండీ డాక్టర్ సీకే వెంకటేశ్వర్లు, రైల్వే సీఎంఎస్ డాక్టర్ అనురాధ రెడ్డి, సీనియర్ డీఎస్టీఈ ప్రతి అగర్వాల్, డీఎన్ ప్రంజల్ పాల్గొన్నారు.
కాజీపేట రైల్వే జంక్షన్ పరిధిలోని రైల్వే పాలిక్లినిక్ దవాఖానను రైల్వే సబ్ డివిజన్ దవాఖానగా ఉన్నతీకరించకుండా అదనపు గదులతో పాలిక్లినిక్ను అప్గ్రేడ్ చేసి ప్రారంభించడంపై రైల్వే దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ అధ్యక్షుడు కాలువ శ్రీనివాస్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కాజీపేట రైల్వే దవాఖాన పరిధిలో దాదాపు 7,500 మంది రైల్వే కార్మికులు, కార్మిక కుటుంబాలు, రిటైర్డ్ కార్మికులు, కుటుంబాలు వైద్య సేవలు పొందుతారని తెలిపారు. గతంలోనే రైల్వే బోర్డుకు కాజీపేట పాలిక్లినిక్ దవాఖానను సబ్డివిజన్ దవాఖానగా అభివృద్ధి చేయాలని కోరినట్లు తెలిపారు. అందుకు రైల్వేబోర్డు సబ్ డివిజన్గా ఉన్నతీకరించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చిందని, అధికారికంగా ఆదేశాలు రాకపోవడంతో రైల్వే ఉన్నతాధికారులు కావాలనే పాలిక్లినిక్ దవాఖానను అప్గ్రేడ్ చేసి అదనపు గదులు నిర్మించి ప్రారంభించడం సరికాదన్నారు. రైల్వే మజ్దూర్ యూనియన్ నాయిని సదానందం, ఎస్కే జానీమియా, సమ్మయ్య, దేవులపల్లి రాఘవేందర్, గరిమిట్ల రాజేశ్వర్రావు, రాజయ్య, ప్రశాంత్, రఘు, రైల్వే రిటైర్డ్ నాయకుడు ఎస్ఆర్వీ రావు ఉన్నారు.
ఖిలావరంగల్: ఓరుగల్లు కోటను దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్కుమార్ జైన్, సికింద్రాబాద్ డివిజనల్ మేనేజర్ భరతేష్ జైన్ బుధవారం సందర్శించారు. స్వయంభూ శంభులింగేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కీర్తితోరణాల ప్రాంగణంలోని శిల్పసంపదతోపాటు ఖుష్మహల్ తదితర చారిత్రక కట్టడాలను వీక్షించారు.