పరకాల, ఏప్రిల్ 14 : నమ్మక ద్రోహానికి మారుపేరు కడియం శ్రీహరి అని, తన రాజకీయ జీవితంలో ఎంతో మంది ఎదుగుదలను అడ్డుకొని పైకి వచ్చారని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి విమర్శించారు. అంబేద్కర్ 133వ జయంతి సందర్భంగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర రాజధానిలో అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్దేనన్నారు. బీఆర్ఎస్ పాలనలో పదవులన్నీ అనుభవించి పార్టీ అధికారం కోల్పోగానే పార్టీని వీడడం కడియం చిత్తశుద్ధిని తెలియజేస్తున్నదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో, ప్రత్యేక తెలంగాణలో ఎంతోమందిని రాజకీయంగా ఎదగకుండా శ్రీహరి అడ్డుకున్నారని విమర్శించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో కావ్యకు ఓటు వేసేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా లేరని, ఆమె ఓటమి ఖాయమన్నారు. రేవంత్ ప్రభుత్వం గ్యారెంటీల అమలు గురించి ఆలోచించకుండా రాజకీయాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, ఉద్యమకారులు, పార్టీ శ్రేణులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు. పార్టీకి ద్రోహం చేస్తే ఊరుకునేది లేదని, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు మడికొండ శ్రీనును సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చందుపట్ల రమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ రేగూరి విజయపాల్రెడ్డి, నిప్పాని సత్యనారాయణ, బండి సారంగపాణి, చందుపట్ల తిరుపతి రెడ్డి, గందె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.