బయ్యారం, జనవరి 4: ప్రజల కంటి సమస్యలపై కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా వైద్యారోగ్య శాఖ సన్నద్ధమవుతోంది. నాలుగేళ్ల క్రితం కంటి వెలుగు మొదటి దఫా నిర్వహించి వేలాది మందికి కళ్లద్దాలు, అవసరం ఉన్న వారికి ఆపరేషన్లు ఉచితంగా చేశారు. ఈనెల 18వ తేదీ నుంచి కంటి వెలుగు రెండో చేపట్టాలనే ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2011 లెక్కల ప్రకారం జిల్లాలో 7,74,549 జనాభా ఉంది. జనాభా పెరిగినందున ప్రస్తుత్తం 8,52,004 ఉండవచ్చని అంచనా. వీరికి కంటి పరీక్షలు చేసేందుకు 38 బృందాలను ఏర్పాటు చేశారు.
ఒక్కో బృందంలో ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ (బీఏఎంఎస్), ఆప్తోమెట్రిస్ట్, డేటా ఎంట్రీ ఆపరేటర్తోపాటు మూడు ఆశ వర్కర్లు, ఇద్దరు ఏఎన్ఎంలు, ఇద్దరు సూపర్వైజర్లు మొత్తం 10 మంది ఉంటారు. జిల్లాలో 461గ్రామ పంచాయతీలు ఉండగా, వీరికి కేటాయించిన వాహనంలో ప్రతి గ్రామ పంచాయతీలో కంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఆయా గ్రామాల పరిధిలోని ప్రజలకు పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని బృందం రోజూ 300మంది, పట్టణ ప్రాంతాల్లోని బృందం 400 మందికి రోజూ కంటి పరీక్షలు చేయాల్సి ఉంటుంది. వంద రోజుల్లో జిల్లాలో నూరు శాతం పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు. కంటి వెలుగులో గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి ప్రతినిధులను సైతం భాగస్వాములను చేయనున్నారు.
ఒక్కో శిబిరంలో ఐదు టేబుళ్లు
కంటి వెలుగు వైద్య శిబిరాల్లో ఐదు టేబుళ్ల వద్ద సిబ్బంది ఉండి సేవలు అందించనున్నారు. ఆయా టేబుళ్లలో రిజిస్ట్రేషన్, ఇంగ్లిష్ అక్షరాల బోర్డును నిర్దేశిత దూరంలో నుంచి గుర్తించడం, తక్కువగా గుర్తిస్తే దగ్గరి/దూరపు కంటిచూపు సమస్య ఉన్నట్లు నిర్దారించడం, వైద్యుడు కంటి కలకలు, నీరు కారడం వంటి సమస్యలకు ఉచితంగా మందులు అందించడం, అవసరమైన వారిని పెద్ద ఆస్పత్రికి రెఫర్ చేయడం, ఆప్తోమెట్రిస్ట్ దగ్గరి చూపు/దూరపు ఉందా అనే అంశాన్ని అధునాతన యంత్రం ద్వారా గుర్తించడం, దగ్గరి చూపు సమస్య ఉంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ వెంటనే రీడింగ్ గ్లాసులు అందించడం, దూరపు చూపు సమస్య ఉంటే ఆప్తోమెట్రిస్ట్ సూచించిన కళ్లద్దాల కోసం కంటి యాప్లో వివరాలు నమోదు చేయడం ఉంటాయి. దీంతో సమాచారం నేరుగా కళ్లద్దాల తయారీ కంపెనీకి చేరుకుంటుంది. నెల రోజుల్లో సంబంధిత లబ్ధిదారుకు అందిస్తారు. వీటిపై బార్కోడ్ ఏర్పాటు చేయడం వల్ల స్కాన్ చేసిన సమయంలో పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంటుంది. ఒకరి కళ్లద్దాలు మరొకరికి ఇచ్చే అవకాశం ఉండదు.
ఇప్పటికే చేరిన సామగ్రి
కంటివెలుగు రెండో విడుత నిర్వహణకు అవసరమైన సామగ్రి ఇప్పటికే చేరుకోగా జిల్లా కేంద్రంలోని ఫార్మసీ స్టోర్లో భద్రపరిచారు. వాటిలో 80వేల కళ్లద్దాలు, కంటివెలుగు శిబిర ప్రచార పత్రాలు, బ్రోచర్లు, ఇంగ్లిష్ అక్షరాల బోర్డులు ఉన్నాయి. ఇప్పటికే 18 ఏఆర్ యంత్రాలు ఉండగా మరో 20 వచ్చాయి. కంటి వెలుగు-2 విజయవంతానికి ముమ్మరంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా మంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యేలు, ఎంపీ, జడ్పీ చైర్పర్సన్, వైద్య శాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కంటి శిబిరాల్లో పాల్గొనే వైద్యాధికారులు, ఏఎన్ఎం, సూపర్వైజర్లకు ఇప్పటికే ట్రైనింగ్ పూర్తి చేశారు. ఈనెల 9న కేంద్రంలో మంత్రి సత్యవతి రాథోడ్, కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించగా కంటి వెలుగుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయవంతం చేస్తాం
కంటి వెలుగు-2 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా చేస్తాం. 38 బృందాలతోపాటు మరో మూడు అత్యవసర బృందాలను అందుబాటులో ఉంచాం. ఎలాంటి ఇబ్బందులు రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నాం. వంద రోజుల్లో నూరు శాతం వైద్య పరీక్షలు పూర్తిచేస్తాం. గ్లాసులు, ప్రచార సామగ్రి, యంత్రాలు జిల్లా కేంద్రానికి ప్రజలు కంటి వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ అంబరీశ్, కంటి వెలుగు జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్