నమస్తే తెలంగాణ నెట్వర్క్: కంటి సమస్యలతో బాధపడే వారి ఇబ్బందులు తీర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించిన కంటివెలుగు శిబిరాలు నాలుగో రోజూ కళకళలాడాయి. పరీక్షలు చేయించుకునేందుకు నగరాలు, పట్టణాలకు వెళ్లే అవసరం లేకుండా ఉన్న చోటనే క్యాంపులు నిర్వహిస్తుండడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఏర్పాటుచేసిన శిబిరాలకు మంగళవారం యువతీయువకుల నుంచి పండు ముదుసలి దాకా అందరూ వచ్చి ఉత్సాహంగా పరీక్షలు చేయించుకోవడం కనిపించింది. అలాగే ఆయాచోట్ల ప్రజాప్రతినిధులు, అధికారులు సందర్శించి సిబ్బందికి సూచనలిస్తుండడంతో క్యాంపుల నిర్వహణ పకడ్బందీగా కొనసాగుతోంది. కంటిచూపు సమస్య ఉన్నప్పటికీ అశ్రద్ధతోనే, ఖర్చుకు భయపడో పరీక్షలు చేయించుకోని వారికి ఈ క్యాంపులు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ముఖ్యంగా మారుమూల పల్లె జనాలకు పట్నం వెళ్లే అవసరం లేకుండా ఉచితంగా టెస్టులు, అద్దాలు అందుతుండడంతో వారిలో ఆనందం వెల్లువెత్తుతోంది.
దగ్గరిచూపు మంచిగైంది..
నర్సింహులపేట : కొద్ది రోజుల నుంచి దగ్గరి చూపు సమస్యతో బాధపడుతున్న. పనులు చేసుకోడానికి ఇబ్బంది అయితాంది. దవాఖానకు పోదామంటే పైసలు ఎన్ని కావాల్నో అని రంది పడేది. ఇంతల సర్కారోళ్లు కంటివెలుగు క్యాంపుల కండ్ల పరీక్షలు చేస్తున్నరని తెలిసింది. పోయి పరీక్ష చేయించుకున్న. డాక్టర్లు చూసి అప్పటికప్పుడు అద్దాలు ఇచ్చిన్రు. ఇప్పుడు కండ్లు మంచిగ నజర్ ఇత్తనయ్. కొందరేమో మాములు అద్దాలు ఇస్తరు. కండ్లు సక్కగ కనవడయ్ అంటే భయపడ్డ. ఇక్కడ గట్ల ఏం లేదు. మంచి అద్దాలే ఇచ్చిన్రు. చాలా సంతోషంగా ఉంది. పేదోళ్లు ప్రైవేటుకు పోయే పనిలేకుంట కేసీఆర్ మంచి సౌలత్ చేశిండు.
– జిగుజెల్ల సుకునమ్మ, నర్సింహులపేట
మందులు, కండ్లద్దాలు ఇచ్చిన్రు
పాలకుర్తి : నేను చిరు వ్యాపారిని. నాకు కంటిచూపు సమస్య ఉంది. ఇంటికి దగ్గరలోనే ఉచితంగా పరీక్షలు చేసి కండ్లద్దాలు, మందులు ఇచ్చారు. చాలా సంతోషం అనిపించింది. కేసీఆర్ కంటివెలుగు పెట్టడం వల్ల నాలాంటి పేదోళ్లకు పైసల భారం తప్పింది. ఊరూరికి క్యాంపులు పెట్టి అందరికీ మేలు చేస్తున్నడు. ప్రైవేట్ దవాఖానకు పోవాల్నంటే రూ.5వేలు దాకా ఖర్చయితయ్. ఇగ వరంగల్కో, హైదరాబాద్కో పోవాల్నంటే బస్సు చార్జీలు, తిండి ఖర్చులు మాతోటి కాదు.. అవన్నీ కష్టాలు లేకుంట ఉన్న ఊరిలోనే కంటి పరీక్షలు చేసుకొనే అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ సార్కు కృతజ్ఞతలు.
– చినుపెల్లి మంజుల, చిరువ్యాపారి, పాలకుర్తి
ఊళ్లెనే క్యాంపు పెట్టిన్రు..
మహదేవపూర్ : నాకు 70 ఏండ్లుంటయ్. కండ్లు సక్కగ కనవడ్తలేవు. ఏం పని చేసుకోవాలన్నా చాన ఇబ్బంది అయితాంది. దవాఖానకు పోదామంటే ఎన్ని పైసల్ కావాల్నో అని పోలే. మొన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సారు ఊళ్లె కంటివెలుగు క్యాంపు పెట్టించిండని ఇంటికి అచ్చి చెప్పిపోయిన్రు. పోయి కంటి పరీక్షలు చేయించుకున్న. డాక్టర్లు మిషన్ వెట్టి చూసిన్రు. నాకు అద్దాలు కూడ ఇచ్చిన్రు. గిప్పుడు కండ్లు మంచిగ కనవడ్తానయ్. ఇదివరకు ఏ సర్కారోళ్లు సుత గిట్ల ఊళ్లెకు వచ్చి పరీక్ష చేయలే. కేసీఆర్ పుణ్యమా అని నా కండ్ల బాధ తప్పింది.
– తిరునగిరి బుచ్చమ్మ, మహదేవపూర్
డాక్టర్లు మంచిగ చూసిన్రు..
నడికూడ : నేను ఇంతకుముందు ప్రైవేట్ దవాఖానల కంటి పరీక్ష చేయించుకున్న. ఇప్పుడు కంటివెలుగులో ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నారని పోయిన. ప్రైవేట్ల చేసినట్టే గవర్నమెంట్ పెట్టిన క్యాంపుల కూడ కొత్త కొత్త మెషీన్లతోటి పరీక్షలు చేస్తున్నరు. అప్పటిదప్పుడే కండ్లద్దాలు కూడ ఉచితంగా ఇచ్చారు. ఓపికగా చూసి, పరీక్షలు కూడా మంచిగ చేస్తున్నరు. చాలా మంచిగ అనిపించింది. సీఎం కేసీఆర్ ఇలాంటి పథకాలు మరిన్ని తీసుకురావాలి. గ్రామంలో ఎవరు కూడా కంటి సమస్యతో బాధపడకుండా మంచి ఆలోచన చేశిండు. ఆయన తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు.
– గోళ్ల స్వామి, మాస్టర్, నడికూడ
ఆపరేషన్ ఫ్రీగా చేస్తమన్నరు..
కురవి : నేను ఆటో నడుపుత. కండ్లు సక్కగ కనిపిస్తలేవు. కంటి సమస్య వల్ల రాత్రిపూట ఆటో తోలకుండా పొద్దుగాలనే ఇంటికి పోతున్న. ప్రైవేట్ ఆస్పత్రికి పోయి చూపించుకునే స్థోమత లేదు. ప్రభుత్వం ఉచితంగా కంటి పరీక్షలు చేస్తున్నదని తెలిసి పోయి చేయించుకున్న. పరీక్షలు చేసి రెండు కళ్లలో పూత వచ్చిందన్నరు. ఆపరేషన్ చేయాలన్నరు. అది కూడా పైసా ఖర్చులేకుండా చేయిస్తామని చెప్పినంక ధైర్యమచ్చింది. గవర్నమెంట్ క్యాంప్ అంటే చూసి మందులు ఇస్తారని అనుకున్న. కానీ పరీక్షలు చేసి అప్పటికప్పుడే అద్దాలు, మందులు ఇచ్చి పంపుతున్నారు. ఫ్రీగా ఆపరేషన్ కూడా చేస్తామని చెబుతున్నరు. నాలాంటి పేదోళ్ల కోసం కేసీఆర్ సార్ మంచిగ చేస్తున్నడు.
– శ్రీరాం వీరభద్రం, ఆటోడ్రైవర్, మోద్గులగూడెం
మస్క మస్క పోయింది..
సంగెం : డ్రైవింగ్ చేసేటప్పడు కండ్లు సరిగ్గా కనపడకపోయేది. మస్క మస్క ఉండేది. సంగెం పీహెచ్సీలో కంటివెలుగు క్యాంపు పెడితే పోయి పరీక్షలు చేయించుకున్న. డాక్టర్లు పరీక్షలు చేసి చుక్కల మందు, కళ్లద్దాలు ఇచ్చారు. ఇప్పుడు అవి పెట్టుకుంటే కండ్లు తేజ్గా కనిపిస్తున్నయ్. కారు డ్రైవింగ్ చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది అనిపించడం లేదు. ఏ ఊరికి ఆ ఊర్లో కంటి వైద్య శిబిరాలు పెట్టి ఓపిగ్గా పరీక్షలు చేస్తున్నరు. నాకు అసలు పరీక్షలు చేయించుకోవాలన్న ఆలోచనే లేకుండె. మా ఊర్లో క్యాంపు పెట్టడం వల్లే నేను పరీక్షలు చేయించుకుని అద్దాలు తీసుకున్న. ఈ అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు. ముందుచూపుతో కంటి వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నందుకు తెలంగాణ ప్రజల ఆయన్ను గుండెల్లో పెట్టుకుంటరు.
– మునుకుంట్ల మోహన్, సంగెం
దూరం పోవుడు తప్పింది
మంగపేట : మాది మారుమూల పల్లెటూరు. కండ్ల సమస్యలొస్తే హనుమకొండకు పోయేది. నాకు కొన్నాళ్ల నుంచి చూపు మస్కగ ఉంది. సిటీకి పోయి టెస్టులు చేయించుకుందామనుకున్న. కానీ ఇప్పుడు మా ఊళ్లెనే పంచాయతీ ఆఫీసు కాడ కంటివెలుగు క్యాంపు పెట్టింన్రని తెల్వంగనే పోయి పరీక్షలు చేయించుకున్న. డాక్టర్లు చూసి ఫ్రీగా అద్దాలు ఇచ్చారు. ఇప్పుడు చూపు మంచిగైంది. నాలెక్క చాలామంది అద్దాలు తీసుకున్నరు. కేసీఆర్ సారు క్యాంపుతోటి మా పల్లె జనాలకు ఎంతో మేలైంది. దూరం పోయే బాధ తప్పింది. ఖర్చులు కూడ మిగిలినయ్. ప్రతి ఏడాది ఇట్లనే క్యాంపు పెట్టాలె.
– మండల ఉప్పలయ్య, బుచ్చంపేట, మంగపేట
పేదోళ్లకు ఎంతో నయం..
రేగొండ : ముఖ్యమంత్రి కేసీఆర్ పేదోళ్ల పెద్దకొడుకు లెక్క అన్నితీర్ల ఆసరా అయితాండు. ఎవరు అడుగకపోయినా జనం కష్టాలు తెలుసుకొని వారి మనస్సుల ఉన్నదేందో తెలుసుకొని పథకాలు పెడుతున్నడు. అందుకే తెలంగాణల ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని మంచి ఆలోచన చేసిండు. కండ్లు మంచిగుండాలని అన్ని ఊర్లలో పరీక్షలు చేయిస్తాండు. నేను కూడా మొన్న పోయి కంటివెలుగు క్యాంపుల పరీక్షలు చేయించుకున్న. డాక్టర్లు చూసి అద్దాలు ఇచ్చిన్రు. ఇంటికో ఇద్దరి ప్రైవేట్ దవాఖానకు పోవాల్నంటే మస్తు పైసలైతయ్. సీఎం సారు రూపాయి ఖర్చు లేకుంట అందరికీ ఫ్రీగా టెస్టులు చేయిత్తాండు. ఇంతకన్న ఏం కావాలె.
– చల్లా రాజేశ్వరి, రేగొండ