శాయంపేట, మే 24 : హరితహారంలో భాగంగా గతంలో రోడ్ల వెంట నాటిన అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు ప్రస్తుతం మట్టిలో కలిసిపోయాయి. మండలంలోని పంచాయతీల కార్యదర్శులు, మండల అధికారుల పర్యవేక్షణ లేక వేలాది మొక్కలు ఆనవాళ్లు కోల్పోయాయి. ఎలాంటి రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో పెరిగిన చెట్లు పూర్తిగా ఎండిపోయాయి. కొన్నిచోట్ల మొక్కలను పశువులు తిన్నాయి. గత ప్రభుత్వంలో హరితహారంలో అవెన్యూ ప్లాంటేషన్ను అధికారులు పండుగ వాతావరణంలో రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు కూలీ చెల్లించి మొక్కలకు రక్షణ చర్యలు తీసుకున్నారు. కానీ కొన్ని నెలలుగా ఆ మొక్కలను పట్టించుకున్న నాథుడే లేడని ప్రజలు ఆరోపిస్తున్నారు. పత్తిపాక నుంచి ప్రగతిసింగారానికి వెళ్లే దారిలో మొక్కలను నాటగా కొద్ది రోజులు సంరక్షించడంతో ఏపుగా పెరిగాయి. ఇప్పుడు చాలా మొక్కలు మట్టిలో కలిసిపోయాయి. నీళ్లు పోయకపోవడం, రక్షించే చర్యలు తీసుకోవడంలో కార్యదర్శి నిర్లక్ష్యం వహించడంతో ఎండిపోయాయి. సూరంపేట, నర్సింహులపల్లి, గట్లకానిపర్తి, గంగిరేణిగూడెం, సూర్యనాయక్తండా, పెద్దకోడెపాక తదితర గ్రామాల పరిధిలో అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు ఎండిపోవడం వారి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మైలారం నుంచి పెద్దకోడెపాక దారిలోని మొక్కలు అగ్నికి ఆహుతైనట్లు స్థానికులు చెప్పారు. అయితే ఈ పరిస్థితికి కార్యదర్శుల నిర్లక్ష్యమే కారణమని మొక్కలను పశువులు మేసినా పట్టించుకోలేదని ఎంపీడీవో ఫణిచంద్ర తెలిపారు. పోయిన చోట మళ్లీ మొక్కలు పెట్టించి, పశువుల యజమానులకు జీపీల ద్వారా నోటీసులు ఇప్పిస్తామని చెప్పారు.