ములుగు, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : పేదింట కల్యాణకాంతులు విరజిమ్ముతున్నాయి. ఆడబిడ్డ లగ్గానికి తెలంగాణ సర్కారు బాసటగా నిలుస్తున్నది. ఆడపిల్లల వివాహానికి సీఎం కేసీఆర్ మేనమామలా కానుక అందిస్తున్నారు. పేదింట పెద్దన్నలా భరోసా కల్పిస్తూ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకానికి అమలుకు ములుగు జిల్లానే నాందికావడం విశేషం. తొలినాళ్లలో పథకం ద్వారా రూ.51 వేలు అందించేంది. 2017లో సీఎం కేసీఆర్ ఆ సొమ్మును రూ.75,116కు పెంచారు. తిరిగి దానిని రూ.60 వేలు పెంచి 2018లో రూ.1,00,116 ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఎనిమిదేండ్లలో ములుగు జిల్లాలలో 10,374 మంది ఆడబ్డిడలకు ప్రభుత్వం రూ.88కోట్ల77వేల264 సాయాన్ని అందించింది. వీరిలో 9,904 మందికి కల్యాణలక్ష్మి, 470 మంది షాదీముబారక్ ద్వారా లబ్ధిపొందారు.
ములుగు నుంచే పుట్టిన పథకం
తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ నేతగా ఉన్న సీఎం కేసీఆర్ ఆడబిడ్డల పెండ్లి కష్టాలను చూసి చలించిపోయారు. తెలంగాణ వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు ఈ కష్టాలను దూరం చేయాలని సంకల్పించారు. 2001లో ములుగు మండలం గుర్తూర్తండాలో కీమానాయక్ సంఘటన నేడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆడబిడ్డల వివాహాలను ఘనంగా నిర్వహించేందుకు కారణమైంది. సీఎం కేసీఆర్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్ని ప్రవేశపెట్టి పేదింటిలో కల్యాణకాంతులు నింపుతున్నారు. ఈ పథకం ద్వారా ఎనిమిదేండ్లలో ములుగు జిల్లా వ్యాప్తంగా 10,374 మంది ఆడబ్డిడలకు ప్రభుత్వం రూ.88కోట్ల77వేల264 సాయం అందించింది. రాష్ట్రంలో అమలై యావత్తు భారత దేశానికి ఆదర్శంగా నిలిచింది.
దరఖాస్తుదారుల్లో 90శాతం మందికి లబ్ధి
జిల్లాలోని తొమ్మిది మండలాల నుంచి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు దరఖాస్తు చేసుకున్న 90శాతం మంది లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం లబ్ధి చేకూర్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా మొదట రూ.50,116 చెల్లించి ఖర్చుల భారాన్ని తెలుసుకున్న సీఎం కేసీఆర్ రెండో విడుత రూ. 75,116 పెంచి ప్రస్తుతం ప్రతి ఆడబిడ్డకు రూ.1,00,116 చెక్కు ద్వారా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లో జమచేస్తున్నారు. ములుగు జిల్లాలో 9,904 మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి పథకం వర్తించగా, 470 మందికి షాదీముబారక్ వర్తించింది. ఇందులో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన 2,225 మంది, ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన 3,022 లబ్ధిదారులతో పాటు బీసీ, ఈబీసీ వర్గాలకు చెందిన మరో 4,652మంది ఈ పథకం ద్వార లబ్ధిపొందారు.
కల్యాణలక్ష్మి పథకం ఆత్మబంధువైంది
నా పెండ్లి సమయంలో కల్యాణలక్ష్మి పథకం ఆత్మబంధువైంది. ములుగుకు చెందిన మా తల్లిదండ్రులు ఉల్లేరావు కృష్ణ-సమ్మక్క నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న సమయంలో అనారోగ్యంతో ఆరు నెలల తేడాలో చనిపోయారు. దీంతో నేను అనాథగా మిగిలాను. మా చిన్నబాపు, చిన్నమ్మ బంధువుల సహకారంతో హనుమకొండ జిల్లా కేంద్రంలోని కుమార్పల్లి ప్రాంతానికి చెందిన నరేశ్తో పెండ్లి కుదిర్చారు. బంధువులు మా అమ్మ బాపు మిగిల్చిన ములుగులోని ఎస్సీ కాలనీలో ఉన్న ఇంటిని కట్నంగా ఇవ్వడంతో పాటు వివాహ ఖర్చులు భరించి ఏ లోటు లేకుండా వివాహం జరిపించారు. కల్యాణలక్ష్మి పథకం గురించి తెలిపి దరఖాస్తు చేయించారు. దరఖాస్తు చేసుకున్న కొద్ది రోజులకే 2020 ఆగస్టు 27న కరోనా సమయంలో వార్డు సభ్యుడు, వీఆర్ఏ ఇంటికి వచ్చి రూ.1,00,116ల కల్యాణలక్ష్మి చెక్కును అందించారు. బ్యాంకు ఖాతాలో జమచేసుకొని పెండ్లి ఖర్చులకు వాడుకున్నారు. తల్లిదండ్రులు లేని నాకు పథకం పెద్దదిక్కుగా మారింది. నా లాంటి ఎంతో మంది ఆడబిడ్డలకు సీఎం కేసీఆర్ ఈ పథకం ద్వారా అండగా నిలుస్తున్నారు.
– ఉల్లేరావు అలేఖ్య, ములుగు జిల్లా కేంద్రం (ఎస్సీ కాలనీ)