హనుమకొండ, సెప్టెంబర్ 7 : జీవితాంతం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తపించిన కాళోజీ నారాయణరావుకు రాష్ట్ర ఏర్పాటు తర్వాతే ఖ్యాతి లభించిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ పేర్కొన్నారు. కుడా చైర్మన్ సంగంరెడ్డి సుందర్రాజ్ యాదవ్, కలెక్టర్ సిక్తా పట్నాయక్తో కలిసి హనుమకొండలోని కుడా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ప్రజల స్థితిగతుల గురించి అనేక సందర్భాల్లో ప్రస్తావించిన మహనీయుడు కాళోజీ అని అన్నారు. జీవితాంతం తెలంగాణ, పేదల కోసం తపించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావుకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా సీఎం కేసీఆర్ గౌరవం కల్పించారని చెప్పారు. కాళోజీ ఆకాంక్షల మేరకు సాకారమైన తెలంగాణలో నారాయణరావు గొప్పతనాన్ని భావితరాలకు తెలియజేసేలా సీఎం కేసీఆర్ అనేక నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు. ముఖ్యంగా కాళోజీ కళాక్షేత్ర నిర్మాణం, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంతో పాటు ప్రతి సంవత్సరం ప్రఖ్యాత కళాకారులకు అవార్డులు అందిస్తున్నారని పేర్కొన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాళోజీ కళాక్షేత్రం నిర్మించేందుకు 300 గజాల స్థలం ఇవ్వాలని కోరితే అప్పటి పాలకులు పట్టించుకోలేదన్నారు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కాళోజీ శతజయంతి సందర్భంగా 2014 సెప్టెంబర్ 9వ తేదీన హనుమకొండ బాలసముద్రంలోని హయగ్రీవాచారి మైదానంలో 2.25 ఎకరాల స్థలంలో రూ.50 కోట్లతో రాష్ట్రంలోనే అతిపెద్ద కళాక్షేత్రం నిర్మించేందుకు శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. అదే విధంగా భావితరాలు కాళోజీని గుర్తుంచుకొనేలా రాష్ట్రంలోని ఏకైక హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు పేరు పెట్టారని తెలిపారు. కాళోజీ పేరుతో తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా కళాకారులకు అవార్డు ఇస్తున్నట్లు చెప్పారు. కాగా కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయని, ఈ నెల తొమ్మిదో తేదీన పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా దీన్ని ప్రారంభించాలని అనుకున్నప్పటికీ, ఈ నెల 8వ తేదీ వరకు వర్షాలు కురిసే అవకాశ ఉందని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో వాయిదా వేశామని పేర్కొన్నారు. త్వరలోనే సీఎం కేసీఆర్, మంత్రుల చేతుల మీదుగా కళాక్షేత్రాన్ని ప్రారంభిస్తామని చెప్పారు.
9న కాళోజీ జయంతి ఉత్సవాలు..
ఈ నెల 9వ తేదీన ప్రజాకవి కాళోజీ నారాయణరావు రాష్ట్ర స్థాయి జయంతి ఉత్సవాలు వరంగల్లోనే జరుపుకొంటామని దాస్యం తెలిపారు. శనివారం ఉదయం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో కాళోజీ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం సాహిత్య, సాంస్కృతిక రంగాల్లో కృషి చేసిన వారికి ఇస్తున్న కాళోజీ పురస్కారాన్ని ఈ సంవత్సరం మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి, పాటల రచయిత, గాయకుడు జయరాజ్కు ఈ నెల 9వ తేదీన అందజేయనున్నట్లు తెలిపారు. అనంతరం కవి సమ్మేళన కార్యక్రమం ఉంటుందని చీఫ్ విప్ చెప్పారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర టూరిజం, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, సాహితీ వేత్తలు, కవులు, కళాకారులు హాజరవుతారని చెప్పారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ.. మరో రెండు మూడు రోజలు భారీ వర్షాలు కురిసే అవకాశ ఉందని వాతావరణ శాఖ వెల్లడించడంతో కాళోజీ కళాక్షేత్రం ప్రారంభోత్సవాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామని పేర్కొన్నారు. కాళోజీ జయంతి ఉత్సవాల సందర్భంగా హరిత కాకతీయ హోటల్లో శనివారం ఉదయం పురస్కార ప్రదాన కార్యక్రమం, ఆ తర్వాత కవి సమ్మేళనం నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో బల్దియా కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషా, రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, గ్రంథాలయ చైర్మన్ అజీజ్ఖాన్, కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు అంపశయ్య నవీన్, వీఆర్ విద్యార్థి, పొట్లపల్లి శ్రీనివాస్రావు, పందిళ్ల అశోక్, కుడా పీవో అజిత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.