కోల్కతా: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రి టాయిలెట్లో ఒక నర్సు అనుమానాస్పదంగా మరణించింది. టాయిలెట్ డోర్ బ్రేక్ చేసి ఆమె మృతదేహాన్ని బయటకు తెచ్చారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. (Nurse Found Dead) పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలో ఈ సంఘటన జరిగింది. నీల్రతన్ సిర్కార్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని గైనకాలజీ విభాగంలో 30 ఏళ్ల రూపాలి బర్మన్ నర్సుగా పని చేస్తున్నది. బుధవారం రాత్రి 8 గంటలకు నైట్ డ్యూటీకి ఆమె హాజరైంది.
కాగా, ఒక రోగికి వైద్య సేవలు అందించిన తర్వాత రాత్రి 10.20 గంటల సమయంలో హెచ్డీ యూనిట్లోని టాయిలెట్లోకి నర్సు రూపాలి వెళ్లింది. ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడంతో సహచరులు పిలిచారు. టాయిలెట్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో వారు ఆందోళన చెందారు. టాయిలెట్ డోర్ బ్రేక్ చేసి లోపలకు వెళ్లి చూశారు. నర్సు రూపాలి నేలపై అపస్మారక స్థితిలో పడి ఉండటంతో వెంటనే ట్రాలీపై చికిత్స కోసం తరలించారు. అయితే డాక్టర్లు పరీక్షించే లోపే ఆమె మరణించినట్లు నిర్ధారించారు.
మరోవైపు ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి చేరుకున్నారు. నర్సు రూపాలి మృతదేహాన్ని పోస్ట్మార్టం కోసం తరలించారు. ఆత్మహత్యపై ఎలాంటి అనుమానాలు లేవని పోలీస్ అధికారి తెలిపారు. ఏం జరిగిందో తెలుసుకునేందుకు టాయిలెట్ వద్ద ఉన్న సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
అయితే ఆరోగ్య శాఖ కూడా ఈ సంఘటనపై ప్రత్యేకంగా విచారణ ప్రారంభించింది. దీని కోసం ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఏడు రోజుల్లోగా ఆరోగ్య శాఖకు నివేదిక సమర్పించాలని ఆదేశించారు.