కాళేశ్వరం, మార్చి13 : తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థాన నూతన పాలకవర్గం కొలువుదీరింది. దేవస్థాన చైర్మన్గా లింగంపల్లి శ్రీనివాస్, ధర్మకర్తలుగా 13 మంది ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసింది. అతిథులుగా వరంగల్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి జడ్పీ చైర్మన్లు గండ్ర జ్యోతి, పుట్ట మధుకర్, జక్కు శ్రీహర్షిణి హాజరుకాగా ఆలయ కార్య నిర్వహణాకారి మహేశ్ దేవస్థాన పాలక మండలితో ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఆలయ రాజగోపురం వద్ద పాలక మండలి సభ్యులు, జడ్పీ చైర్మన్లకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
గణపతి విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు చేయించారు. చైర్మన్ పదవికి జరిగిన ఎన్నికల్లో ధర్మకర్తలు అడప సమ్మయ్య, కమిడి రాంరెడ్డి బలపరిచిన లింగంపల్లి శ్రీనివాస్రావును చైర్మన్గా ఎన్నుకున్నారు. అనంతరం స్వామి వారి గర్భగుడిలో, శుభానందదేవి పార్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఈవో మహేశ్ జడ్పీ చైర్మన్లను, దేవస్థాన పాలక మండలిని స్వామివారి శేష వస్ర్తాలతో సన్మానించారు.ఆలయ ప్రధాన అర్చకుడు కృష్ణమూర్తిశర్మ అనారోగ్యంతో ఉండడంతో ధర్మకర్తగా ప్రమాణ స్వీకారం చేయలేదు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ లింగంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ కాళేశ్వర ముక్తీశ్వరస్వామి ఆలయాన్ని అన్నివిధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని తెలిపారు.
ఆలయ ధర్మకర్తలు వీరే..
ఆలయ ధర్మకర్తలుగా అడప సమ్మయ్య, కమిడి రాంరెడ్డి, శ్యాంసుందర్, దేవేందర్, పద్మ, భానుప్రకాశ్, వెంకటస్వామి, రాజయ్య, సత్యనారాయణ, రమేశ్, ప్రశాంత్రెడ్డి, దేవేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాణీబాయి, ఎంపీటీసీ మమత, సర్పంచ్ వసంత, మహదేవపూర్, కాటరం సొసైటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, చల్లా నారాయణరెడ్డి, మాజీ ధర్మకర్త రాంనారాయణ, నాయకులు నాగరాజు పాల్గొన్నారు.
ఆలయాన్ని అభివృద్ధి చేయాలి : పుట్ట మధుకర్
కాళేశ్వర ముక్తీశ్వర ఆలయానికి ఘన చరిత్ర ఉందని, దీనిని మరింతగా అభివృద్ధి చేసేందుకు నూతన పాలక మండలి కృషి చేయాలని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ అన్నారు. దేవస్థాన పాలక మండలి ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందిందన్నారు. సమైక్య రాష్ట్రంలో ఆలయ అభివృద్ధిని విస్మరించారని మధుకర్ వివరించారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి రూ.25 కోట్లు వెచ్చించారని గుర్తు చేశారు. ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా కాళేశ్వరంలో ఒకే పానవట్టంపై రెండు శివ లింగాలు ఉన్నాయని, ఇది త్రివేణి సంగమం అన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచేగాక దేశంలోని వివిధ రాష్ర్టాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో ఆలయాన్ని దర్శించేందుకు భక్తులు వస్తారని ఆయన తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు రికార్డుల స్థాయిలో పూర్తయినట్లుగానే ఆలయాన్ని కూడా అన్నివిధాల అభివృద్ధి చేయాలని కోరారు. మంథని నియోజకవర్గ పరిధిలోని ఈ ఆలయంతోపాటు గ్రామాల అభివృద్ధికి ఇక్కడి ఎమ్మెల్యే ఏనాడైనా కృషి చేశారా అని మధుకర్ ప్రశ్నించారు.
బీజేపీ బెదిరింపులకు భయపడం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ అక్రమ కేసులు బనాయిస్తున్నదని పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ విమర్శించారు. ప్రధాని మోదీ ఎన్ని ఇబ్బందులకు గురిచేసినా బీఆర్ఎస్ నేతలు భయపడరని స్పష్టం చేశారు. వరంగల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ పాలకులు కుట్ర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుంటే దీనిని ఓర్వలేని ఆ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణి మాట్లాడుతూ కాళేశ్వరం ఆలయ అభివృద్ధికి నూతన పాలక మండలి కృషి చేయాలని కోరారు.