హనుమకొండ చౌరస్తా : స్వరాష్ట్ర సాధన కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన కాకతీయ యూనివర్సిటీ (కేయూ)ని తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ పైలట్ ప్రాజెక్టు ( Pilot Project ) గా ఎంపిక చేయాలని కేయూ ( Kakatiya University ) విద్యార్థి ఉద్యమకారుల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. శనివారం కేయూ ఎస్డీఎల్సీఈ ప్రాంగణంలో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు.
ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన విద్యార్థి ఉద్యమకారులను గుర్తించి వారికి న్యాయం చేయాలని కేకే ఆధ్వర్యంలో ఏర్పాటైన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమంలో తమ విలువైన సమయాన్ని, విద్యను, భవిష్యత్తును త్యాగం చేసిన విద్యార్థి ఉద్యమకారుల సంక్షేమాన్ని రాష్ర్ట ప్రభుత్వం బాధ్యతగా తీసుకోవాలని కోరారు. గతంలో ప్రతిపక్ష నాయకుడిగా కాకతీయ యూనివర్సిటీని సందర్శించిన ప్రస్తుత ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేసి, కేయూ విద్యార్థి ఉద్యమకారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఝార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాదిరిగా ఉద్యోగ నియామకాలలో విద్యార్థి ఉద్యమకారుల కు 10 శాతం సమాంతర రిజర్వేషన్ ను తెలంగాణలో కూడా అమలు చేయాలన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారుల చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలని కోరారు. ఈ సమావేశంలో జాక్ కేయూ విద్యార్థి ఉద్యమకారుల నాయకులు సాదు రాజేష్, సయ్యద్ వలీ ఉల్లా ఖాద్రి, ఫిరోజ్ పాషా, చిర్రా రాజు, మంద వీరాస్వామి, దేవోజీనాయక్, శ్రీరామ్ శ్యామ్, బండి శ్రీనివాస్, గజ్జల మల్లేష్, ఎస్.అనిల్, ప్రేమ్, కొమురయ్య, ఆరూరి రంజిత్, క్రాంతి, కన్నం సునీల్, పర్లపల్లి శ్రీశైలం, నాగారాజు పటేల్, జెట్టి రాజేందర్, కే.చిరంజీవి, ప్రసాద్ ఉన్నారు.