ఉప్పెనలా తరలివచ్చిన జనాలు.. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు.. గులాబీ జెండాలు చేబూని డప్పుచప్పుళ్లతో వేలాదిగా తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులతో స్టేషన్ఘన్పూర్ పట్టణ వీధులు గురువారం కిక్కిరిసిపోయాయి. కళాకారుల ఆటపాటలు, డప్పుచప్పుళ్లతో తరలిరాగా మహిళలు బతుకమ్మలతో వచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కడియం శ్రీహరికి ఘన స్వాగతం పలికారు. అనంతరం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో కడియం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో మంత్రి ఎర్రబెల్లి , స్థానిక ఎమ్మెల్యే రాజయ్య పాల్గొన్నారు. కడియం శ్రీహరి విజయం ఖాయమని, మెజార్టీయే లక్ష్యమన్నారు.
స్టేషన్ ఘన్పూర్, నవంబర్ 9 : ఎటుచూసినా వేలాదిగా తరలివచ్చిన జనం.. ఉప్పెనను తలపించేలా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు.. జై తెలంగాణ.. జై కేసీఆర్ అంటూ నినాదాలు.. గులాబీ పార్టీ కార్యకర్తలు, సబ్బండవర్గాలతో గురువారం స్టేషన్ఘన్పూర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి గురువారం స్టేషన్ఘన్పూర్లోని నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఆర్డీవో రామ్మూరికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మొదటి సెట్ను జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్రెడ్డి, కడియం కావ్య, జోగు కుమారస్వామితో కలిసి నామినేషన్ వేశారు. రెండో సెట్ను మధ్యాహ్నం 2.45 గంటల ప్రాంతంలో స్థానిక ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పార్టీ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, పెసరు రమేశ్, గాదెపాక అయోద్యతో కలిసి దాఖలు చేశారు. భారీ ర్యాలీలో రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పాల్గొన్నారు. నియోజకవర్గం నలుమూలల నుంచి తరలివచ్చిన బీఆర్ఎస్ శ్రేణులు బతుకమ్మలు, పీరీలతో కడియం శ్రీహరికి ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పుల్లు, కోలాట కళాకారులతో ఎంపీడీవో కార్యాలయం నుంచి శివాజీ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పబ్లిక్ మీటింగ్లో ముందుగా ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరి నామినేషన్కు తరలి వచ్చిన జనాన్ని చూస్తే ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతాయన్నారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం బీఆర్ఎస్కు అడ్డా అని, గతంలో కడియం శ్రీహరి ఈ నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ది చేశారన్నారు. ఇద్దరం కలిసి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. ఈ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిగా కడియం శ్రీహరికి అవకాశం ఇచ్చారని, భారీ మెజార్టీతో గెలిపించి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.
ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటా ..
గత ఎన్నికల్లో తనను ఎంపీగా, డాక్టర్ తాటికొండ రాజయ్యను ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో దీవించారు. ఈ సారి ఎమ్మెల్యే అభ్యర్థిగా సీఎం కేసీఆర్ నన్ను ఆశీర్వదించారు. నామినేషన్కు వచ్చిన పార్టీ శ్రేణులను చూస్తుంటే నియోజకవర్గంలో పార్టీ ఎంత పటిష్టంగా ఉందో అర్ధమవుతోంది. ఈ ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయం. సీఎం కేసీఆర్ పాలనపై నమ్మకం, విశ్వాసం ప్రజలకుంది. అందుకే ఇంత పెద్ద ఎత్తున తరలివచ్చారు. మీకందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నియోజకవర్గ ప్రజలు అశీర్వదిస్తే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ఎమ్మెల్యే రాజయ్య, మంత్రి ఎర్రబెల్లి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి సహకారంతో, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో లెదర్ పార్క్ పునరుద్ధరిస్తా. నిరుపేద దళిత కుటుంబాలకు ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటా. గెలిచిన ఆరు నెలల్లో నియోజకవర్గంలోని ప్రతి ఎకరానికి రెండు పంటలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తా. నియోజకవర్గ విద్యార్థుల కోరిక మేరకు మొదటి సంవత్సరంలోనే జనరల్ డిగ్రీ కళాశాల వచ్చేలా చర్యలు తీసుకుంటాం.
టీ-పీసీసీ వైధ్య విభాగం సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ బొల్లపల్లి కృష్ణ ఆ పార్టీకి రాజీనామా చేసి గురువారం బీఆర్ఎస్లో చేరారు. కడియం నామినేషన్ అనంతరం పబ్లిక్ మీటింగ్లో మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరగా గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మాచర్ల గణేశ్, మాజీ ఎమ్మెల్యే ఆరోగ్యం, రాష్ట్ర నాయకులు మాదాసు వెంకటేశ్వర్లు, చేపూరి వినోద్, వేలేరు జడ్పీటీసీ సరిత, బీఆర్ఎస్ జిల్లా నాయకులు చింతకుంట్ల నరేందర్ రెడ్డి, బెలిదె వెంకన్న, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పోగుల సారంగపాణి, కడియం యువసేన సభ్యులు, కడియం సోషల్ మీడియా వారియర్స్, బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు , నాయకులు పాల్గొన్నారు.
ఆరు దశాబ్దాలు పాలించిన కాంగ్రెస్ ఈ దేశానికి, తెలంగాణకు చేసిన అభివృద్ధి ఏంటని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. ప్రస్తుతం మీరు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ కంటే గొప్పగా ఏం చేస్తున్నారని నిలదీశారు. ఎన్నికలు రావడంతో ఓట్లకోసం వచ్చే నాయకులను నిలదీయాలని ఆయన సూచించారు. రేవంత్ రెడ్డి ఓ బ్రోకర్.. ఓటు కోసం ప్రజలను మాయ మాటలతో మోసం చేయాలని చూస్తున్నాడని విమర్శించారు. కాంగ్రేస్ పాలనలో కరెంటు లేక, సాగునీరు లేక మోటర్లు, ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయి, పంటలు ఎండి ఎంతో నష్టపోయారన్నారు. తెలంగాణ వచ్చాక సాగునీరు, కరెంటు ఇవ్వడమే కాకుండా రైతుకు పెట్టుబడి సాయం అందిస్తున్న ప్రభుత్వం బీఆర్ఎస్ అన్నారు. రైతులకు 24 గంటల కరెంటు ఎందుకు మూడు గంటలు చాలు అని చెప్పిన రేవంత్రెడ్డి తెలంగాణలో 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, రైతు ప్రభుత్వం అన్నారు. ఈ నియోజవర్గానికి కడియం శ్రీహరి ఉండడం మీ అదృష్టమని, కడియంను లక్ష మెజార్టితో గెలిపిస్తే ఈ నియోజకవర్గ అభివృద్ధికి నేను, ఎమ్మెల్యే రాజయ్య కృషి చేస్తామన్నారు.
ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేస్తున్న ఇందిరకు నియోజకవర్గంలోని ఊర్ల పేరు, గ్రామాల్లోని సమస్యలు ఏమాత్రం తెలియవని కడియం శ్రీహరి అన్నారు. అభివృద్ది ఎలా చేయాలో తెలియని ఇందిరకు ఓటు వేస్తే చిన్న పనికి కూడా మీరు హైదరాబాద్కు వెళ్లాల్సి వస్తుందన్నారు. కాంగ్రెస్కు ఓటు వేస్తే కరెంటు కష్టాలు తప్పవన్నారు. బీఆర్ఎస్ను ఆధరిస్తే ఎమ్మెల్యే రాజయ్య, నేను మీకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారంలో అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ పాలనను చూసి ఓటేయాలని కోరారు. అవినీతి కుంభకోణాల కాంగ్రెస్, మతతత్వ బీజేపీకి గుణపాఠం చెప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు.