వేలేరు, అక్టోబర్ 1 : కాంగ్రెస్ రాష్ట్రంలో దివాళా తీసిన పార్టీగా మారిందని, రాష్ర్టానికో పాలసీని అమలు చేస్తున్న ఆ పార్టీ నాయకుల మాటలు నమ్మితే ఆగమైపోతామని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం వేలేరు మండలం పీచర గ్రామంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ కార్డు స్కీంలను ఆ పార్టీ పాలిత రాష్ర్టాల్లో ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు నమ్మి వారికి ఓటు వేస్తే ఆగమైపోతామని అన్నారు. బీజేపీకి నాలుగైదు సీట్లు వస్తే ఎక్కువని, అది పేపర్లకే పరిమితమైన పార్టీ అని అన్నారు.
స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలో అభివృద్ధిలో ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తానని తెలిపారు. ధర్మసాగర్, వేలేరు, తరిగొప్పుల, నర్మెట్ట మండలాలను కలిపి జనగామ వరకు డబుల్ రోడ్డు వేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం పీచరకు చెందిన బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి రఘునాయకుల ప్రమోద్రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరగా ఆయనకు కడియం శ్రీహరి కండువా కప్పి ఆహ్వానించారు. అలాగే, గ్రామానికి చెందిన పలువురు బీజేపీ, బీఎస్పీ నాయకులు సూమారు 50 మంది ఎమ్మెల్సీ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎంపీపీ సమ్మిరెడ్డి, జడ్పీటీసీ చాడ సరితారెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు నర్సింహారావు, సర్పంచ్ మ్యాక రవీందర్, గ్రామ అధ్యక్షుడు తిరుపతి, ఏఎంసీ మాజీ వైస్ చైర్మన్ రాంగోపాల్రెడ్డి, మాజీ జడ్పీటీసీ కీర్తి వెంకటేశ్వర్లు, మల్లికార్జున్, గోదల రాజిరెడ్డి పాల్గొన్నారు.
ఉనికిచర్ల అభివృద్ధి బాధ్యత నాదే
మడికొండ : స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని ఉనికిచర్ల గ్రామం అభివృద్ధి బాధ్యత తనదేనని బీఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి అన్నారు. గ్రేటర్ 64వ డివిజన్ ఉనికిచర్ల గ్రామంలో నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాగా, అభివృద్ధి పనులతో పాటు బస్ సౌకర్యం, కమ్యూనిటీ భవనాలు కావాలని గ్రామస్తులు కోరడంతో వాటిని కూడా త్వరగా మంజురు చేస్తామని కడియం హామీ ఇచ్చారు. అనంతరం ఇతర పార్టీలకు చెందిన సుమారు 35 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ఆవాల రాధికారెడ్డి పాల్గొన్నారు.
ఖబరస్థాన్ నిర్మాణ మంజూరు పత్రం అందజేత
ధర్మసాగర్ : మండల కేంద్రంలోని ముస్లింల కోసం ఖబరస్థాన్ నిర్మాణానికి ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆదివారం స్థానిక ముస్లింలకు స్టేషన్ఘన్పూర్లో మంజూరు పత్రం అందజేశారు. ఎమ్మెల్సీ నిధుల నుంచి రూ.5లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ సందర్బంగా మండల కేంద్రానికి చెందిన ముస్లింలు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ పిట్టల శ్రీలత, ధర్మసాగర్ సర్పంచ్ ఎర్రబెల్లి శరత్చంద్రప్రసాద్, ముస్లింలు ఎండీ యాకూబ్ పాషా, షంశొద్దీన్, ఖాసీం, ఎండీ హాఫీజ్, ముజ్జు పాల్గొన్నారు.