రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతుండగా, ఎలాగైనా కొలువు కొట్టి జీవితంలో స్థిరపడాలనే లక్ష్యంతో ఉద్యోగార్థులు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. టీఎస్పీఎస్సీ, ఇతర నియామక సంస్థల నుంచి వరుస నోటిఫికేషన్లు వెలువడుతుండడంతో అభ్యర్థులు ప్రిపరేషన్లో నిమగ్నమయ్యారు. కొందరు సొంతంగా ఇంటి వద్దనే సిద్ధమవుతుండగా, మరికొందరు ప్రభుత్వం అందించే ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రూప్-3, 4 ఉద్యోగాల కోసం జనగామ జిల్లా బీసీ స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో గీతానగర్లోని ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల ఆవరణలో సెప్టెంబర్ 20 నుంచి ఉచిత శిక్షణ అందిస్తున్నారు.
70 మంది విద్యార్థులు రెగ్యులర్ తరగతులకు హాజరవుతుండగా, ఆర్థమెటిక్, రీజనింగ్, పాలిటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, సోషియాలజీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ నాలెడ్జ్, కరంట్ అఫైర్స్ వంటివి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లతో బోధిస్తున్నారు. 75శాతం హాజరు ఉన్న వారికి స్టాండర్డ్ మెటీరియల్ కూడా ఉచితంగా ఇస్తున్నారు.
– జనగామ చౌరస్తా, డిసెంబర్ 15
రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. టీఎస్పీఎస్సీ, ఇతర నియామక సంస్థలు వరుస నోటిఫికేషన్లు ఇస్తుండడంతో కొలువుల సాధనే లక్ష్యంగా ఉద్యోగార్థులు పోటీ పడుతున్నారు. 24 గంటలు పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. గ్రూప్ -3, 4 పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం రాష్ట్ర సర్కారు వివిధ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచిత శిక్షణను అందిస్తున్నది. ఇందులో భాగంగా జనగామ జిల్లా కేంద్రంలోని గీతానగర్లో ఉన్న ప్రభుత్వ ఏబీవీ డిగ్రీ కళాశాల ఆవరణలో బీసీ స్టడీ సెంటర్ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉద్యోగార్థులకు సెప్టెంబర్ 20 నుంచి 75 రోజుల ఉచిత శిక్షణను అందిస్తున్నది. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో తరగతులు నిర్వహిస్తున్నది.
ఆర్థమెటిక్, రీజనింగ్, పాలిటీ, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, సోషియాలజీ, ఎకనామిక్స్, జాగ్రఫీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ నాలెడ్జ్, కరంట్ అఫైర్స్ వంటి సబ్జెక్ట్లను నిపుణులతో బోధిస్తున్నది. ఇందులో కోచింగ్ పొందడానికి జిల్లాలోని పలు మండలాల నుంచి 120 మంది ఎన్రోల్ చేసుకోగా, ప్రస్తుతం 70 మంది రెగ్యులర్గా తరగతులకు హాజరవుతున్నారు. ఇప్పటి వరకు 50 రోజుల శిక్షణ ముగిసింది. 75 రోజుల శిక్షణ అనంతరం 75 శాతం హాజరు శాతం ఉన్న అభ్యర్థులకు బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో స్టాండర్డ్ మెటీరియల్ను కూడా అందజేయనున్నారు.
తమ చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకునేందకు అభ్యర్థులు క్రమశిక్షణతో ఉచిత శిక్షణా తరగతులకు హాజరవుతూ ప్రణాళికాబద్ధంగా చదువుతున్నారు. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు అందుబాటులో ఉన్న అన్ని గ్రంథాలయాల్లో స్టడీ మెటీరియల్ను అందుబాటులో ఉంచారు. తరగతులు జరుగుతున్న తీరును ఇటీవల బీసీ వెల్ఫేర్ స్టేట్ అసిస్టెంట్ డైరెక్టర్ కే అలోక్ కుమార్ స్వయంగా పరిశీలించారు. అభ్యర్థులు నియామక పరీక్షల్లో విజయం సాధించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.
జూనియర్ అసిస్టెంట్ సాధిస్తా..
నేను ఎం.ఏ (సోషియాలజీ) పూర్తి చేశాను. జూనియర్ అసిస్టెంట్ కొలువు సాధించాలన్నదే నా స్వప్నం. దానికోసం వేలకు వేలు ఫీజులు పెట్టి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి శిక్షణ తీసుకునే ఆర్థిక స్థోమత లేదు. ప్రస్తుతం జిల్లా బీసీ స్టడీ సెంటర్ వారు ఇచ్చే 75 రోజుల ఉచిత శిక్షణకు రెగ్యులర్గా హాజరవుతున్నాను. సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్తో క్లాసులు బోధిస్తున్నారు. శిక్షణ తరగతులు ముగిసిన తర్వాత విలువైన స్టడీ మెటీరియల్ను కూడా ఇస్తామన్నారు. జూనియర్ అసిస్టెంట్ కొలువు సాధిస్తాననే నమ్మకం ఉంది.
– మమత, అభ్యర్థి, కోలుకొండ గ్రామం, దేవరుప్పుల మండలం
ప్రభుత్వానికి కృతజ్ఞతలు
నేను ఎం.కామ్, బీ.ఎడ్ పూర్తి చేశాను. బీసీ స్టడీ సెంటర్ ద్వారా అందిస్తున్న ఉచిత కోచింగ్ నిరుద్యోగులకు ఉపయోగకరంగా ఉంది. మారుమూల గ్రామీణ ప్రాంతాల అభ్యర్థులకు కొత్తగా ఏర్పడిన జిల్లా కేంద్రాల్లో ప్రభుత్వం ఉచిత శిక్షణ ఇస్తుండడంపై సంతోషంగా ఉంది. శిక్షణతో పాటు విలువైన స్టడీ మెటీరియల్ను కూడా ఇవ్వనున్నారు. నిరుద్యోగులందరి పక్షాన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– బీ రజిని, అభ్యర్థి, రఘునాథపల్లి