భూపాలపల్లి : భూపాలపల్లి జిల్లాలో పల్లె ప్రకృతి వనాల పనుల్లో నిర్లక్ష్యం చేయవద్దని, పెండింగ్ పనులు త్వరగా పూర్తి చేయాలని జడ్పీ సీఈఓ శోభారాణి అధికారులను కోరారు. మంగళవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ స్థాయి సంఘాల సమావేశం జరిగింది. 1,2,4,7 వ స్థాయి సంఘాల సమావేశాలు జడ్పీ చైర్పర్సన్ జక్కు శ్రీహర్షిణిరాకేశ్ అధ్యక్షతన జరుగాల్సి ఉండగా అనారోగ్య కారణాలతో చైర్పర్సన్ రాకపోవడంతో సీఈఓ శోభారాణి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అలాగే 3,5,6 స్థాయి సంఘాల సమావేశం జడ్పీ వైస్ చైర్పర్సన్ కళ్లెపు శోభారఘుపతిరావు అధ్యక్షతన జరుగాల్సి ఉండగా వైస్చైర్పర్సన్ హజరుకాకపోవడంతో డిప్యూటీ సీఈఓ రఘువరన్ అధ్యక్షతన సమావేశం కొనసాగింది.
జిల్లాలో 241 వైకుంఠ ధామాలకు గాను ఇంకా ఆరు పెండింగ్లో ఉన్నాయని, వాటిని సైతం త్వరగా పూర్తి చేయాలని, మండలానికి ఐదు చొప్పున 55 బృహాత్ పల్లె ప్రకృతి వనాలు మంజూరయ్యాయని, ఇందులో 11 పురోగతిలో ఉండగా మిగిలినవి స్థలాలను గుర్తించే స్థాయిలోనే ఉన్నాయని, వాటిపై దృష్టి పెట్టి త్వరగా పనులు ప్రారంభమయ్యేలా చూడాలని అధికారులను ఆమె ఆదేశించారు.
జిల్లాలో ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్యను పెంచాలని, ఈ విషయమై కలెక్టర్ పదే పదే ఆదేశించడం జరుగుతుందని గుర్తు చేశారు.
అధికారులు విధి నిర్వహణలో ఏ మాత్రం అలసత్వం వహించకుండా అభివృద్ధిపై దృష్టి సారించాలని కోరారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో ముందుకు సాగినప్పుడే జిల్లా అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. డిప్యూటీ సీఈఓ మాట్లాడుతూ జిల్లాలో రైతులు ఆయిల్ ఫాం సాగుపై దృష్టి పెట్టాలని, ప్రభుత్వం ఆయిల్ ఫాం సాగుపై ప్రత్యేక దృష్టి సారించి రాయితీలు ఇస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, జడ్పీటీసీలు పాల్గొన్నారు.