చిట్యాల, జూలై 17 : రెండు నెలల క్రితం తల్లి కరోనాతో మృతి చెందగా మనోవేదనకు గురైన ఓ బాలిక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నది. ఈ ఘటన మండలంలోని ఒడితల గ్రామంలో జరిగింది. ఎస్సై వీరభద్రరావు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పట్టెం వీరస్వామికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు. రెండు నెలల క్రితం వీరస్వామి భార్య కరోనాతో మృతి చెందగా చిన్న కూతురు భవాని(17) తీవ్ర మనోవేదనకు గురైంది. ఈక్రమంలో శుక్రవారం ఇంటి వెనుకాల పురుగుల మందు తాగింది. గమనించిన స్థానికులు వెంటనే చిట్యాల సివిల్ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది. రెండు నెలల క్రితం భార్య, ఇప్పుడు కూతురి మృతితో తండ్రి కన్నీటి పర్యంతమయ్యాడు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.