హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ) : సెమీకండక్టర్ల తయారీ రంగంలో తెలంగాణ మరో కీలక ముందడుగు పడింది. చిప్ల తయారీలో అత్యంత కీలకమైన కెమికల్ మెకానికల్ పాలిషింగ్ (సీఎంపీ) ప్యాడ్ టెక్నాలజీకి సంబంధించిన దేశంలోనే తొలి హబ్ హైదరాబాద్లోని టీవర్క్స్లో ఏర్పాటుచేసింది. జపాన్కు చెందిన తోహో కోకి సీసాకుషో కంపెనీ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శనివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ర్టాన్ని దేశంలోనే ప్రముఖ సెమీకండక్టర్ హబ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని, ఈ లక్ష్య సాధనలో తాజాగా ప్రారంభించిన సీఎంపీ ప్యాడ్ టెక్నాలజీ హబ్ కీలక పాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
చిప్ల తయారీలో వాఫర్ను సమతులంగా మార్చేందుకు ఉపయోగించే ఈ సీఎంపీ ప్యాడ్లను ప్రస్తుతం పూర్తిగా విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నామని, ఈ హబ్ ఏర్పాటుతో ఇప్పటివరకు విదేశాలకే పరిమితమైన ఈ నయా టెక్నాలజీ తొలిసారిగా దేశంలో హైదరాబాద్ వేదికగా అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. విద్యార్థులు, పరిశోధకులు, ఆవిషర్తలు, స్టార్టప్లు, పరిశ్రమలకు ఈ కేంద్రం ద్వారా శిక్షణతో పాటు పరిశోధనలు చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక సహకారం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రముఖ విద్యా, పరిశోధన సంస్థలు, పరిశ్రమలు, ఎంఎస్ఎంఈల భాగస్వామ్యంతో వచ్చే 18 నుంచి 24 నెలల్లో సీఎంపీ ప్యాడ్లను దేశంలోనే తయారు చేసేలా సంయుక్త పరిశోధనలు చేపడతామని వివరించారు.
సెమీకండక్టర్ రంగంలోని అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకునేందుకు జపాన్ లాంటి దేశాలతో కలిసి ముందుకు సాగుతున్నామని, పరిశోధన నుంచి చిప్ల తయారీ వరకు అవసరమైన సమగ్ర ఎకోసిస్టమ్ను రాష్ట్రంలో అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమానికి తోహో కోకి సీసాకుషో కంపెనీ ప్రతినిధి టకుయా నిషిమురా, జెట్రో బెంగళూరు డైరెక్టర్ జనరల్ స్వస్తిక్ కులకర్ణి, ఇండోబాక్స్ వ్యవస్థాపకుడు, సీఈవో డైసుకే టాంజి, జపాన్ ఇండియా బిజినెస్ బ్యూరో ఛైర్మన్ షిగెమారో యాసుయి, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి అనుదీప్ దురిశెట్టి, టీ-వర్స్ సీఈవో జోగిందర్ తనికెళ్ల తదితరులు పాల్గొన్నారు.