సిద్దిపేట, జూలై 11: తనకు ఇంజినీరింగ్ సీటు ఇప్పించి కెరీర్లో నిలదొక్కుకునేలా సహకరించినందుకు రోహిత్ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి రుణం తీర్చుకోవడానికి ముందుకు వచ్చాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. సిద్దిపేట పట్టణానికి చెందిన శ్రీనివాస్, వనిత దంపతుల కుమారుడు రోహిత్కు విజ్ఞాన జ్యోతి ఇనిస్టిట్యూట్ అండ్ టెక్నాలజీ (వీఎన్ఆర్) కళాశాలలో కంప్యూటర్ సైన్స్లో సీటు కోసం గతం లో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావును కలిసి విజ్ఞప్తి చేశారు. అప్పట్లో హరీశ్రావు ఫోన్ చేసి అతనికి కళాశాలలో సీటు ఇప్పించాడు. చదువు ముగిసిన తర్వాత రోహిత్ రూ.12 లక్షల వార్షిక వేతనంతో అమెరికాలో బహుళ జాతి సంస్థలో ఉద్యోగం సాధించాడు.
సాయం పొంది మరిచిపోతున్న ఈ రోజుల్లో, తనకు హరీశ్రావు ఎంతో సాయం చేశారని గుర్తుచేసుకున్న రోహిత్ శనివారం సిద్దిపేటలో హరీశ్రావును కలిసి తన చదువుకు సాయం చేసిన విషయాన్ని గుర్తుచేశాడు. హరీశ్రావు మీద ఉన్న ప్రేమ, కృతజ్ఞతాభావంతో శనివారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీశ్రావును కలిసి తన వార్షిక వేతనంలో సగం రూ. 6లక్షలను సమాజ సేవా కార్యక్రమాలకు వినియోగించాలని హరీశ్రావుకు విరాళంగా అందించారు. దీంతో హరీశ్రావు సంతోషం వ్యక్తం చేసి రోహిత్ను అభినందించాడు.రోహిత్ తీసుకున్న ఈ గొప్ప నిర్ణయానికి హరీశ్రావు ఉద్వేగానికి లోనయ్యారు. రోహిత్ ఎందరికో ఆదర్శంగా నిలిచారని ఈ సందర్భంగా రోహిత్ను సన్మానించి అభినందించారు.