జయశంకర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు వంకలు జోరుగా ప్రవహిస్తున్నాయి. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ట్రావెల్స్ బస్సు కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ రహదారిపై బురుదలో కూరుకుపోయింది. దీంతో ప్రయాణికులు అర్ధరాత్రి నుంచి బస్సులోనే బిక్కుబిక్కుమంటూ గడిపారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జేసీబీ సహాయతో బస్సును బురదలోంచి బయటికి తీశారు. కాళేశ్వరం నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నదని అధికారులు తెలిపారు.