భూపాలపల్లి: జాతీయ రహదారి కోసం భూసేకరణ పూర్తి చేయాలని కేంద్ర రవాణా శాఖ కార్యదర్శి కె.ఎస్. శ్రీనివాసరాజు అన్నారు. ఆయన జిల్లా కలెక్టర్లు, నేషనల్ హైవే అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంచిర్యాల-హన్మకొండ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణాన్ని చేపట్టేందుకు ఇప్పటికే భూసేకరణకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని, త్వరగా సర్వే పూర్తి చేసి ప్రజాభిప్రాయ సేకరణ పూర్తి చేయాలని అన్నారు.
కాటారం సమీపంలో నిర్మాణంలో ఉన్నటోల్గేట్ ను పూర్తి చేయాలని, సిరోంచా మహాదేవ్పూర్ జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు చర్యలు చేపట్టాలని అన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే టేకుమట్ల, చిట్యాల, మొగుళ్లపల్లి మండలాల్లో 25 కిలోమీటర్లు వెళుతుందని, ఆ మూడు మండలాల్లో ఇప్పటికే సర్వే ద్వారా 90 శాతం భూమిని గుర్తించడం జరిగిందని తెలిపారు.
త్వరలో ల్యాండ్ ఆక్వేషన్ ప్రక్రియ పూర్తి చేస్తామని, కాటారం సమీపంలో టోల్గేట్ నిర్మాణం వేగంగా జరుగుతుందని అన్నారు. మహాదేవ్పూర్ జాతీయ రహదారి నిర్మాణానికి అవసరమైన భూ సేకరణకు చర్యలు చేపడతామని కలెక్టర్ తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో ఆర్డివో శ్రీనివాస్, కలెక్టరేట్ భూ సేకరణ విభాగం సూపరింటెండెంట్ రవికుమార్, నేషనల్ హైవే ఏఈఈ సుమిత్కుమార్, తదితరులు పాల్గొన్నారు.