భూపాలపల్లి : భూ సేకరణకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి సింగరేణి సంస్థకు అవసరమైన భూ సేకరణను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రెవెన్యూ, సింగరేణి అధికారులతో కేటికే-2, కేటికే-3 ఓపెన్ కాస్ట్లకు కావలసిన భూ సేకరణ పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఒక క్రమ పద్ధతిలో భూ సేకరణ చేయకపోతే భూ సేకరణ పూర్తవడానికి చాలా సమయం పడుతుందని, సమయం పెరిగిన కొద్దీ అనేక సమస్యలు ఎదురవుతాయని అన్నారు.
కాబట్టి ఎలాంటి సమస్యలు లేకుండా ప్రైవేట్ సర్వేయర్లకు బదులుగా ఇతర జిల్లాల నుంచి డిప్యూటేషన్ లో ప్రభుత్వ సర్వేయర్లను జిల్లా కు తీసుకు వచ్చి భూ సేకరణ పూర్తి చేయాలని, భూ సేకరణకు రెవెన్యూ, ప్రభుత్వ సర్వేయర్ లతో పాటు సింగరేణి సంస్థ సర్వేర్లను, అధికారులను భూ సేకరణకు కేటాయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత, జిల్లా అదనపు కలెక్టర్ దివాకర, ఆర్డీవో శ్రీనివాస్, కలెక్టరేట్ సూపరింటెండెంట్ రవికుమార్, భూపాలపల్లి, గణపురం తహసీల్దార్లు ఇక్బాల్, సతీష్కుమార్, రెవెన్యూ, సింగరేణి అధికారులు పాల్గొన్నారు.