భూపాలపల్లి : ప్రతి గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించి కొత్తగా ఉపాధిహామీ జాబ్ కార్డులను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్ దివాకర్ తో కలిసి జిల్లా కేంద్రంలోని ప్రగతి భవన్ లో పల్లె ప్రగతి పనుల పురోగతి పై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో చేపట్టిన పల్లె ప్రగతి పనులను వెంటనే పూర్తి చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేరకు పల్లెలు అభివృద్ధి చెందేలా అధికారులు పనిచేయాలని అన్నారు.
దివ్యాంగులను కూడా ఉపాధి హామీ పనుల్లో భాగస్వాములను చేసి ఉపాధి కల్పించాలని అన్నారు. మండల, గ్రామ స్థాయిల్లో అధికారులంతా గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా సయుక్తంగా విధులు నిర్వహించి గ్రామీణాభివృద్ధిలో జిల్లా ఆదర్శంగా నిలిచేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీవో పురుషోత్తం, జడ్పిసీఈవో శోభారాణి, డీపీవో ఆశాలత, డివిజనల్ పంచాయతీరాజ్ అధికారి సుధీర్కుమార్, ఎంపీడీవోలు, ఎంపీవోలు, పంచాయతీరాజ్ ఇంజనీర్లు, ఈజీఎస్ ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లు, తదితరులు పాల్గొన్నారు.