జయశంకర్ భూపాలపల్లి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడలేని విధంగా ప్రతిష్టాత్మకంగా చేపట్టి అమలు చేస్తు ఆదర్శంగా నిలుస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పేదల సర్వోతోముఖాభివృద్ధి కోసం చేపట్టిన పలు పథకాలు ప్రజలకు సత్వరంగా అందించాలనే ప్రభుత్వ లక్ష్యానికి నూరుశాతం అమలు చేసే విధంగా చర్యలు చేపడుతున్నారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి. కళ్యాణ లక్ష్మి, షాదిముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను మంజూరు చేయిస్తు లబ్ధిదారుల గ్రామాల్లోకి తరలివెళ్లి వారికి అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
దీని వలన గ్రామాల్లోకి లబ్ధిదారులు తమ పనులు వదులుకొని, జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి రావలసిన అవసరం లేకుండానే ఎమ్మెల్యేనే స్వయంగా మంజూరి అయిన చెక్కులను తీసుకుని లబ్ధిదారుల వద్దకు వెళ్లి పంపిణీ చేస్తూ వారికి ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ప్రణాళికలను రూపొందించి అమలు చేస్తున్నారు.