భూపాలపల్లి రూరల్ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు సజావుగా జరిగేలా అధికారులు నిబంధనల మేరకు పని చేయాలని సంయుక్త కలెక్టర్ కూరాకుల స్వర్ణలత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని జేసీ చాంబర్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిఘా బృందాల అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం జేసీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసినందున ఎన్నికల నిబంధనల మేరకు పని చేయాలని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనకు గురికాకుండా అధికారులు పగడ్బందీగా పర్యవేక్షించాలన్నారు.
ఎన్నికలు సజావుగా జరిగేందుకు అధికారులచే వివిధ బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఆయా బృందాలకు నిర్ధేశించిన విధులను సక్రమంగా నిర్వహించాలన్నారు. అనంతరం ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్న మున్సిపాలిటీ కార్యాలయాన్ని సందర్శించి వసతులను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, జడ్పీసీఈవో శోభారాణి, తాసిల్దార్లు, ఎంపీడీవోలు, వివిధ ఎన్నికల నిఘా బృందాల సభ్యులు పాల్గొన్నారు.