భూపాలపల్లి టౌన్ : జిల్లాలో ఫైలేరియా వ్యాధిపై దృష్టి సారించి, గృహ సందర్శనలో కేసులు నమోదు చేసి ప్రొఫైల్ సిద్ధం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరాం కోరారు. మంగళవారం భూపాలపల్లిలోని డీఎంఅండ్హెచ్వో కార్యాలయంలో పారా మెడికల్ సిబ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వ్యాధుల నిర్ధారణపై శిక్షణ ఇచ్చారు. జిల్లాలో బోధకాలు (ఫైలేరియా) కేసులు తక్కువగా ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా ఉండవద్దని, గృహ సందర్శనలో విలేజ్ హెల్త్ ప్రొఫైల్ను సిద్ధం చేయాలని, దీంతో ఫైలేరియా కేసుల డాటా బయటికి వస్తుందన్నారు. డాటా ప్రకారం చికిత్స మొదలు పెట్టాలని వ్యాధిని ముందే గుర్తిస్తే లైఫ్ గ్రంధులు దెబ్బ తినకుండా పేషెంట్ను కాపాడవచ్చని అన్నారు.
కేసులు ఎక్కువగా ఉన్న సబ్సెంటర్ను, ఒక్కో గ్రామాన్ని ఎంపిక చేసుకుని రాత్రి 8:30 గంటల నుంచి అర్ధరాత్రి 12గంటల వరకు రక్తపూతల సేకరణ చేయాలని, పేషెంట్ల వివరాలను నమోదు చేసే ఫాంను వెంట తీసుకెళ్లాలని కోరారు. ఫైలేరియా ఉన్నట్లయితే తలప్పి, ముక్కు కారడం, వాంతులు, స్వల్ప జ్వరం, చంకల్లో, గజ్జల్లో లిప్ గ్రంధుల వాపు ఉంటుందని తెలిపారు. వ్యాధిని ముందస్తుగా గుర్తిస్తే చికిత్స సులభతరమవుతుందని అన్నారు. సమావేశంలో అసిస్టెంట్ డైరెక్టర్ నాగయ్య, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ మమతా దేవి, మాస్ మీడియా ఆఫీసర్ అన్వర్, భాష్యానాయక్, సీహెచ్ఓ రాజయ్య, విద్యాసాగర్, వెంకటేశ్వర రాజు, నాగిరెడ్డి, శ్రీనివాస్, సూపర్వైజర్లు పాల్గొన్నారు.