భూపాలపల్లి రూరల్ : గిరివికాస్ పథకం ద్వారా గిరిజన రైతుల పంట భూములకు సాగునీటి సౌకర్యం కల్పించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టర్ కార్యాయంలో సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించి జిల్లాలో గిరివికాసం కార్యక్రమం అమలుపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గిరివికాస్ పథకంలో జిల్లాలో మూడు కోట్ల రూపాయలకు పైగా నిధులు అందుబాటులో ఉన్నాయని, గ్రామ సభల ద్వారా గిరిజన రైతులను ఎంపిక చేసి వారి పంట భూముల్లో సాగునీటి సౌకర్యం కల్పించేందుకు కృషి చేయలన్నారు. భూగర్భ జలాల లభ్యతను పరిశీలించి ఉచితంగా బోరు తవ్వించి మోటర్ పెట్టి విద్యుత్ కనెక్షన్ సౌకర్యం కల్పించి గిరిజన రైతుల పంట భూములకు సాగునీరు అందించలన్నారు.
అదే విధంగా జాతీయ ఉపాధి హామీ పథకం కార్యక్రమం ద్వారా వారి పంట భూములను అభివృద్ధి చేసి గిరిజన రైతుల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ టీఎస్ దివాకర, డీఆర్డివో పురుషోత్తం, అడిషనల్ డీఆర్డీవో అంజయ్య, జియాలజిస్ట్ కిరణ్, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.