జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లి పట్టణంలో ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి (Mla Venkata Ramana Reddy ) నిర్మించిన వేంకటేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavati Rathod) అన్నారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వేంకటేశ్వర ఆలయంలో శుక్రవారం గర్భగుడిలో వేంకటేశ్వర స్వామి (Venkateshwara Swamy) విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తిరుమల తిరుపతి దేవస్థాన ఆస్థాన పండితులు ఎన్వీ మోహనరంగాచార్యుల పండిత బృందం వేద మంత్రోచ్ఛారణాల మధ్య స్వామి వారికి ప్రాణప్రతిష్ట చేశారు. ఎమ్మెల్యే గండ్ర దంపతులు, కుటుంబ సభ్యులు విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమానికి కలెక్టర్ భవేశ్మిశ్రా, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు, రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి తదితరులు హాజరై పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ తాను తిరుపతి (Tirupati) కి ప్రతి మూడు నెలలకోసారి వెళ్తుంటానని, హైదరాబాద్లోని బిర్లా మందిర్ (Birla Mandir) కు సైతం వెళ్తుంటానని అన్నారు. ఇంత పెద్ద వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని భూపాలపల్లిలోనే చూస్తున్నానని అన్నారు. సాక్షాత్తూ వేంకటేశ్వరస్వామి ఇక్కడికి వచ్చి అందరిని ఆశీర్వదిస్తున్నట్లు ఉందని కొనియాడారు. విగ్రహ ప్రతిష్ఠాపనకు భక్తులు వేలాదిగా తరలివచ్చి పూజలు నిర్వహించారు.