మల్హర్ : బాల్య వివాహాలు చేయడం, ప్రోత్సహించడం చట్టరిత్యా నేరమని బాలల సంరక్షణ అధికారి హరికృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని రుద్రారంలో భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన మైనర్ బాలికకు వివాహం నిశ్చయించారనే విషయం తెలుసుకుని వెంటనే వివాహ నిరోధక అధికారి, ఐసీడీఎస్ సూపర్వైజర్ సరస్వతితో కలిసి గ్రామానికి చేరుకోగా అబ్బాయి, అమ్మాయి క్రితం రోజే ఎవరికి చెప్పకుండా వివాహం చేసుకున్నారని తెలిసింది. అనంతరం అధికారులు తల్లిదండ్రులకు, కుల పెద్దలకు కౌన్సెలింగ్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ చిన్నతనంలో వివాహాలు చేయడం వల్ల పిల్లల చదువులు మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉందనీ, అంతేగాక అనేక రకాల మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయని, పోషకాహార లేమి ఏర్పడి రక్తహీనత సమస్య తలెత్తుతుందని అన్నారు. చిన్నతనంలో గర్భం ధరించడం వల్ల గర్భాశయ క్యాన్సర్ వంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టం 2006 ప్రకారం ఏ వ్యక్తి అయినా బాల్య వివాహం ప్రోత్సహించినా రెండేళ్ల వరకు జైలుశిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించడం జరుగుతుందన్నారు.
బాల్య వివాహాల గురించి తెలిస్తే చైల్డ్ లైన్ 1098కు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్సై అజీజుద్దీన్, వైస్ ఎంపీపీ స్వరూప రాజయ్య, కౌన్సిలర్ స్వప్న, లింగారావు, సర్పంచ్ నారాయణ ధనలక్ష్మీ, చైల్డ్ లైన్ ప్రతినిధి సుప్రియ, రాంచరణ్, కార్యదర్శి శ్రీలక్ష్మీ, అంగన్వాడీ టీచర్లు మమత, సుమలత తదితరులున్నారు.