భూపాలపల్లి, డిసెంబర్ 9 : జేఏసీ పిలుపు మేరకు మొదటి రోజు గురువారం భూపాలపల్లి బొగ్గు గనుల్లో సమ్మె సంపూర్ణంగా జరిగింది. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, సింగరేణిలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలం నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని మొత్తం 12 డిమాండ్లతో టీబీజీకేఎస్తో పాటు, ఐదు జాతీయ కార్మిక సంఘాలు జేఏసీగా ఏర్పడి ఈ నెల 9, 10, 11 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చిన విషయం విధితమే. భూపాలపల్లి ఏరియాలో కేటీకే 1, 5, 6, 8 భూగర్భ గనులు, కేటీకే ఓసీపీ-2, కేటీకే ఓసీపీ -3 గనుల్లో ప్రస్తుతం బొగ్గు ఉత్పత్తి జరుగుతుంది. భూపాలపల్లి ఏరియాలో డిసెంబర్లో రోజుకు 15,815 టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని సంస్థ లక్ష్యంగా నిర్ధేశించింది. కాగా, సాధారణ రోజుల్లో ప్రతిరోజూ 7,500 టన్నుల బొగ్గు ఉత్పత్తి జరిగేది. గురువారం భూపాలపల్లి బొగ్గు గనుల్లో సంపూర్ణంగా సమ్మె జరగడంతో బొగ్గు పెళ్ల కూడా బయటకు రాలేదు. భూపాలపల్లి ఏరియాలో డిపార్ట్మెంట్లు, గనుల్లో కలిపి మొదటి షిఫ్టులో మొత్తం 3443 మంది ఉద్యోగులు విధులకు హాజరు కావాల్సి ఉండగా, గనులు, డిపార్ట్మెంట్లు, ఏరియా దవాఖానలో పనిచేసే అత్యవసర సిబ్బంది 542 మంది మాత్రమే హాజరయ్యారు. అలాగే, రెండో షిఫ్టులో 1,092 మందికి 161 మంది అత్యవసర సిబ్బంది విధులకు హాజరయ్యారయ్యారు. మొదటి షిఫ్ట్లో 226.21 టన్నుల బొగ్గు భూపాలపల్లి ఏరియా నుంచి బొగ్గు ఆధారిత పరిశ్రమలకు రవాణా జరిగిందని ఏరియా సింగరేణి అధికార ప్రతినిధి అజ్మీరా తుకారాం తెలిపారు. మొదటి రోజు సమ్మె మూలంగా 15,815 టన్నుల బొగ్గు ఉత్పత్తికి నష్టం జరుగగా, టన్నుకు ఒక్కంటికి రూ. 3035 చొప్పున, 15,815 టన్నులకు రూ.4.79 కోట్లు సంస్థ ఉత్పత్తి రూపేణా నష్టపోయింది. సమ్మె పరిస్థితిని సమీక్షించేందుకు పర్యవేక్షణ కమిటీని వేశారు. ఈ కమిటీలో ఎస్వోటూ జీఎం విజయప్రసాద్, ఏజీఎం(ఈఅండ్ఎం) రాజలింగం, డీజీఎం(క్వాలిటీ) కవీంద్ర, పీఎం అజ్మీరా తుకారాం, సెక్యూరిటీ ఆఫీసర్ షరీఫ్ ఉన్నారు.