స్టేషన్ ఘన్పూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాబోవు ఎన్నికల నాటికి ప్రతి రైతుకు చేరేలా వ్యవసాయ పాలకవర్గం, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య అన్నారు. సోమవారం స్టేషన్ ఘన్పూర్ వ్యవసాయ మార్కెట్ నూతన కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ఎమ్మెల్యే అధ్యక్షత వహించగా ఎంపీ పసునూరి దయాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎమ్మెల్యే రాజయ్య మాట్లాడుతూ వ్యవసాయదారులకు, వ్యాపారులకు మార్కెట్ పాలక వర్గం మధ్య వర్తులుగా ఉండాలని, మార్కెట్లో ఎలాంటి సమస్యలు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డులో కమీషన్ ఏజెంట్ను ఏర్పాటు చేయడానికి, పశువుల అంగడీ ఏర్పాటుకు కృషి చేస్తానని పేర్కొన్నారు.
దొడ్డు వడ్లు తీసుకోబోమని కేంద్ర ప్రభుత్వం చెప్పడంతో ఆందోళన చెందుతున్న రైతులకు దొడ్డు వడ్లను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ తీపి కబురు చెప్పారని పేర్కొన్నారు. ఎంపీ దయాకర్ మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఇతర రాష్ట్రాల ప్రజలు తమ గ్రామాలను తెలంగాణ కలుపుకోవాలని కోరుతున్నారని అన్నారు. అనేక పథకాలతో వ్యవసాయానికి పెద్దపీట వేస్తున్న ముఖ్యమంత్రిని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఎంవో నాగేశ్వర శర్మ, జనగామ మార్కెట్ చైర్మన్ బాల్నే విజయా సిద్ధులు, ఎస్టీ కార్పొరేషన్ చైర్మన్ గాంధీ నాయక్, కొమురవెళ్లి దేవస్థాన మాజీ చైర్మన్ సంపత్, కూడా డైరెక్టర్ ఆకుల కుమార్, జడ్పీటీసీలు, ఎంపీపీలు ఎంపీటీసీలు, సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.