దుగ్గొండి, సెప్టెంబర్ 1 : యువకులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిషత్తో పాటు నాయకత్వ లక్షణాలు అలవడుతాయని రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు శానబోయిన రాజ్కుమార్ అన్నారు. గత రెండు రోజులుగా దుగ్గొండి మండలంలోని దేశాయిపల్లి గ్రామ ప్రభుత్వ పాఠశాల మైదానంలో ఉమ్మడి వరంగల్ జిల్లా అమెచ్యూర్ రెజ్లింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అండర్ -23 సంవత్సరాల విబాగంలో కుస్తీ (రెజ్లింగ్) పోటీలను నిర్వహించగా బుధవారం ముగిశాయి. క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు పతాకాలతో పాటు సర్టిఫికెట్లు అందజేశారు. జిల్లా స్థాయిలో రాణించిన క్రీడాకారులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈక్రీడాకారులు హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి రెజ్లింగ్ క్రీడాపోటీల్లో పాల్గొననున్నారని నిర్వాహకులు తెలిపారు. ఈసందర్భంగా జరిగిన క్రీడల ముగింపు సమావేశంలో అతిదులతో పాటు ముఖ్య అతిదిగా రెజ్లింగ్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు శానబోయిన రాజ్కుమార్ పాల్గొని మాట్లాడారు. క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని క్రీడపోటీల ద్వారానే క్రీడాకారుల్లో దాగి ఉన్న నైపుణ్యం వెలికితీయవచ్చన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ప్రతి క్రీడాకారుడు క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు.