నర్సంపేట/ఆత్మకూరు/సంగెం/నడికూడ/నల్లబెల్లి/పరకాల/దామెర/శాయంపేట/దుగ్గొండి, జూలై 21: జిల్లాలో ఎడతెరిపి లేని వాన కురుస్తున్నది. మంగళవారం రాత్రి నుంచి ముసురు పడుతున్నది. దీంతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు, కుంటల్లోకి వరదనీరు చేరుతుండడంతో అలుగు పోస్తున్నాయి. నర్సంపేట మండలంలో ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లోని జలాశయాలు నీటితో కళకళలాడుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంగెం మండలంలో జోరువాన కురిసింది. మండలంలోని చెరువులు, కుంటలు పూర్తిస్థాయలో నిండాయి. మొండ్రాయిలోని కోమటికుంట చెరువు మత్తడి పోస్తున్నది.
ఎల్గూర్చెరువులో నీరు మత్తడి వరకు చేరింది. చెరువులు, బావుల కింద వరి నాట్లు వేసేందుకు రైతులు పనులను ముమ్మురం చేశారు. నడికూడ మండలంలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. సమృద్ధిగా నీరు ఉండడంతో వ్యవసాయ పనులు చురుగ్గా సాగుతున్నాయి. నల్లబెల్లి మండలంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు మండలంలోని చెరువులు, కుంటలు మత్తడి పోస్తున్నాయి. మరో రెండు రోజులు వర్షాలు ఇలాగే ఉంటే రంగాయ చెరువు మత్తడి పడే అవకాశం ఉంది. పరకాల మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటల్లోకి భారీగా వరద నీరు చేరింది. పలు చెరువులు మత్తడి దుంకుతుండగా పట్టణ శివారులోని చలివాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది.
దామెర మండలంలోని దామెర, ఊరుగొండ, పులుకుర్తి, పసరుగొండ, కోగిల్వాయిలోని చెరువులు, కుంటల్లోకి వరద నీరు భారీగా చేరుతున్నది. ఊరుగొండ పెద్దచెరువు, పులుకుర్తి రంగనాయకుల చెరువుతోపాటు పనరగొండ చెరువు మత్తడి దుంకుతున్నాయి. శాయంపేట మండలంలో జోరు వాన కురిసింది. కొన్నిచోట్ల వాన దంచికొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. మండల పరిధిలోని 66 చెరువులు నిండాయని ఐబీ అధికారులు తెలిపారు. చలివాగు ప్రాజెక్టు మత్తడి దుంకుతున్నది. ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దుగ్గొండి మండలంలోని మైసంపల్లిలో భారీ వర్షానికి మోకిడె దేవరావుకు చెందిన పెంకుటిల్లు నేలమట్టమైంది. పలువురి ఇండ్ల గోడలు కూలిపోయాయి. మండలవ్యాప్తంగా ముసురు పడుతున్నది.