కరీమాబాద్, జూలై 20 : తమ ఇలవేల్పు బీరన్నస్వామికి కురుమ కులస్తులు మంగళవారం బోనాలు సమర్పించారు. ఏటా తొలి ఏకాదశి రోజు ఎంతో ఆడంబరంగా నిర్వహించే బోనాల ఊరేగింపును కరోనా నేపథ్యంలో ఈ సారి నిరాడంబరంగా జరుపుకొన్నారు. ఉర్సు, కరీమాబాద్, రంగశాయిపేట ప్రాంతాల్లోని కురుమ కులస్తులు భక్తి శ్రద్ధలతో బోనాలు చేసి, ఎలాంటి ఊరేగింపు లేకుండా ఎవరికి వారు ఆలయానికి వచ్చి స్వామివారికి నైవేద్యం సమర్పించారు. ప్రత్యేక పూజలు చేశారు. పిల్లాపాపలు, పాడి పంటలను చల్లంగ చూడమని బండారి దేవుడిని భక్తితో వేడుకున్నారు. మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఎర్రబెల్లి ప్రదీప్రావు, కార్పొరేటర్ పల్లం పద్మ , గుండు చందన స్వామిని దర్శించి పూజలు చేశారు. ఉర్సు ఆలయ చైర్మన్ మరుపల్ల రవి, కరీమాబాద్ ఆలయ కమిటీ అధ్యక్షుడు కోరె నాగరాజు, రంగశాయిపేట ఆలయ కమిటీ అధ్యక్షుడు మండల నర్సింహరాములు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు.
ఉర్సులోని ఆలయ కమిటీ చైర్మన్ మరుపల్ల రవి ఇంటి నుంచి ఉదయం పట్టు వస్ర్తాలు, కురుమ కుల సేవా భవనం నుంచి ఆర్య సమాజం జెండాతో డోలు వాయిద్యాల నడుమ కురుమ కులస్తులు బీరన్నకుంటలోని ఆలయానికి చేరుకొని స్వామివారికి సమర్పించారు. ఆలయంపై జెండాను కట్టి దేవుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. కరీమాబాద్లోని కురుమ కుల సంఘం ఆధ్వర్యంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు కోరె నాగరాజు ఇంటి నుంచి పట్టు వస్ర్తాలు, జాతీయ జెండాతో బీరన్నకుంటలోని ఆలయానికి చేరుకొని జెండా ఎగురవేశారు. బీరన్నస్వామి -కామరతి దేవి కల్యాణాన్ని వేడుకగా జరిపించారు. ఇక రంగశాయిపేటకు చెందిన కురుమ కులస్తులు ఎవరికి వారుగా బోనాలతో రంగశాయిపేటలోని ఆలయానికి చేరుకొని స్వామివారికి నైవేద్యం సమర్పించారు. మొదట ఆలయ పూజారి మండల కృష్ణమూర్తి ఇంటి నుంచి పూజా సామగ్రిని తీసుకెళ్లారు.
బండారి దేవుడికి భక్తితో మొక్కులు
జనగామ, జూలై 20 (నమస్తే తెలంగాణ)/ కాశీబుగ్గ/ ఎల్కతుర్తి : తొలి ఏకాదశిని పురస్కరించుకొని కాశీబుగ్గ ఓ సిటి రోడ్డులోని బీరన్న బోనాల పండుగ ఘనంగా జరిగింది. మేయర్ గుండు సుధారాణి మహిళలతో కలిసి బోనమెత్తారు. శివసత్తుల ప్రత్యేక నృత్యాల నడుమ ఆలయానికి వెళ్లి బీరన్నస్వామికి నైవేద్యం సమర్పించారు. బీరన్నస్వాములు గొర్రె పిల్లను గావుపట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఎల్కతుర్తి మండల కేంద్రంలో డప్పు చప్పుళ్ల నడుమ మహిళలు బోనాలతో బీరన్న ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు చేశారు. జనగామ జిల్లాకేంద్రంలోని కురుమవాడలో బోనాల పండుగ ఘనంగా జరిగింది. కురుమ కులస్తులు బీరన్నకు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కళాకారులు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.