చాయ్వాలా ప్రధాని అయితే పేదలకు మేలయితదనుకున్నం
కానీ, నానాటికీ దేశ ప్రజల ఆర్థిక పరిస్థితి దిగజారుతున్నది..
పూటకు కోటి రూపాయల డ్రెస్సు వేసే మోదీ.. గిరిజనులను మాత్రం పట్టించుకోవడంలేదు..
2017లోనే ఎస్టీ రిజర్వేషన్ల ప్రతిపాదనలు పంపాం
లేఖ అందలేదని కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ అబద్ధాలు ఆడుతున్నడు
రిజర్వేషన్ల పెంపుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు
10 శాతానికి పెంచేదాకా పోరాడుతం
కార్పొరేట్ భజన చేస్తున్న మోదీకి గుణపాఠం తప్పదు
మహబూబాబాద్, మార్చి 25 : చాయ్వాలా దేశానికి ప్రధాని అయితే పేదలకు న్యాయం జరుగుతుందనుకున్నాం.. కానీ, మోదీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలోని ప్రజల ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతోందని మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన రిజర్వేషన్ల పెంపుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని, దేశానికి పట్టిన దరిద్రంలా ఆ పార్టీ తయారైందని విమర్శించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె కేంద్రప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. ప్రపంచంలోని వివిధ దేశాధినేతలను కలిసేందుకు వెళ్లే సమయంలో రూ.కోటి ఖరీదైన డ్రెస్సులు వాడే ప్రధాని మోదీ, దేశంలోని గిరిజనులను మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ 6 శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్ను 10 శాతానికి పెంచాలనే ఆలోచనతో 2015లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి చెల్లప్ప ఆధ్వర్యంలో కమిషన్ వేశారు.. 2011సెన్సెస్ ప్రకారం గిరిజనుల రిజర్వేషన్ను 10 శాతానికి పెంచాలని ఆయన 2016లో రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
దానికి 2017 ఏప్రిల్ 15న రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపి, అదే ఏడాది మే 29న తీర్మాన ప్రతులను రాష్ట్రపతి సమర్పించగా, కేంద్ర హోంశాఖ మంత్రిత్వ శాఖ తిరిగి బదులు కూడా ఇచ్చినట్లు’ తెలిపారు. గిరిజనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేసినా, కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు తాజాగా పార్లమెంట్ సాక్షిగా పచ్చి అబద్ధాలాడాడని, రాష్ట్రం నుంచి తమకు ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని మాట్లాడడం మంచిపద్ధతి కాదని హెచ్చరించారు. రిజర్వేషన్ల పెంపుపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని, ఇలాంటి చౌకబారు రాకీయాలు చేసే ఆ పార్టీని దేశం నుంచి తరిమికొట్టాలన్నారు.
స్వయానా బీసీ వర్గానికి చెందిన వ్యక్తి దేశానికి ప్రధాని అయితే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని భావించామని, కానీ, ఆయన కార్పొరేట్ సంస్థలతో దోస్తీ కట్టి దేశాన్నే తాకట్టు పెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. తెలంగాణలో గిరిజనుల స్థితిగతులు తెలిసిన సీఎం కేసీఆర్ రాష్ట్ర బడ్జెట్లో రూ. 12,565 కోట్లను ప్రవేశపెట్టారని, దేశంలో 7.80శాతం ఉన్న గిరిజనుల సంక్షేమానికి కేంద్రం రూ. 8వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నదని దుయ్యబట్టారు. 1984లో 4శాతం ఉన్న గిరిజనుల రిజర్వేషన్ను 6 శాతానికి పెంచిన ఘనత తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్దని స్పష్టం చేశారు.
తెలంగాణలో గిరిజన యూనివర్సి కోసం 334.30 ఎకరాల భూమిని కేంద్రానికి అప్పగిస్తే ఇంతవరకు అతీగతి లేదన్నారు. బయ్యారం ఉక్కు- తెలంగాణ హక్కు అని నినదిస్తూ పలుమార్లు లేఖలు రాస్తే, సరైన ఐరన్ఓర్ ఉత్పత్తిలేదని సాకులు చెప్పి దాటవేస్తున్నదని విమర్శించారు. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ కోసం తెలంగాణ ప్రభుత్వం రూ.150కోట్లు ఎండోమెంట్ శాఖకు చెల్లించి భూములను అప్పగిస్తే ఆ ఊసే ఎత్తడంలేదన్నారు. తెలంగాణ కుంభమేళా సమ్మక్క-సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించమంటే మొండికేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీ ప్రధానిగా ఉన్న దేశంలో ఇప్పటి వరకు బీసీ కేంద్ర మంత్రిత్వశాఖ లేకపోవడం చేతగాని తనానికి నిదర్శనమని న్నారు. కాంగ్రెస్ పనైపోయింది.. ఇక తమను అడిగే వారులేరని ఆగడాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ చెంపపెట్టులా మారిందన్నారు. కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం స్వర్ణయుగాన్ని చూస్తుందన్నారు. గిరిజలను ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు హైదరాబాద్లో సేవాలాల్, కుమ్రంభీం భవనాలను నిర్మిస్తున్నామని, ఇక్కడికి ఏ రాష్ట్రం నుంచి వచ్చిన గిరిజనులకైనా ఆశ్ర యం కల్పించడం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు.