కృష్ణకాలనీ, మార్చి 25: తెలంగాణ రైతులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ, తెలంగాణ రైతులపై కేంద్ర మంత్రి చేసిన విద్వేష పూరితమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని క్షమాపణ చెప్పాలనే డిమాండ్తో ఎమ్మెల్యే గండ్ర ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఆందోళన చేశారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ దిష్టిబొమ్మ దహనం మానవహారంగా ఏర్పడి రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రైతుల సమస్యకు పరిష్కారం చూపాలని కోరుతూ రాష్ట్ర మంత్రులు ఢిల్లీకి వెళ్తే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిసేందుకు రెండు రోజులుగా సమయం ఇవ్వలేదని, గురువారం తెలంగాణ మంత్రుల బృందంతో వడ్డు కొనం.. ఏం చేసుకోండి.. మీ రాజ్యం వచ్చిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి’ అంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని, తెలంగాణ రైతులను కించపరిచేలా మాట్లాడటం సిగ్గు చేటన్నారు. కించపరిచేలా మాట్లాడిన బీజేపీ నాయకులను ప్రజలు గుర్తుంచుకోవాలన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలే కీలకమని, ప్రజలను కించపరిచిన ప్రభుత్వం నామారూపాలు లేకుండా పోతుందన్నారు. రైతులు కష్టపడి పండించిన పంటను కొనకుండా పీయూష్ గోయల్ వ్యంగ్యంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పీయుష్ గోయల్ తెలంగాణ రైతులకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, బీజేపీ నాయకులను ఊళ్లల్లో తిరుగనిచ్చేది లేదన్నారు. దేశంలో పంజాబ్కో నీతి.. తెలంగాణకో నీతా? అని ప్రశ్నించారు. పంటకు మద్దతు ధర అంటే తెల్వనోళ్లు ప్రధాని కావడం మన దేశానికి శాపమన్నారు. దేశంలో రైతులు పండించిన పంటను కేంద్రమే కొనుగోలు చేయాలని, ఇందుకు చట్టబద్ధత తీసుకు రావాలని డిమాండ్ చేశారు. తక్షణమే తెలంగాణ రైతులు యాసంగిలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్దు, వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, ఆలయ కమిటీ చైర్మన్ కుమార్రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ మేకల సంపత్కుమార్, టీఆర్ఎస్ అర్భన్ అధ్యక్షుడు కటకం జనార్థన్పటేల్, మాజీ అధ్యక్షుడు క్యాతరాజు సాంబమూర్తి, టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అర్భన్ అధ్యక్షుడు మోకిడి అశోక్, టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు బుర్ర రమేష్, బీబీచారి, బండారి రవి, మేనం తిరుపతి, బుర్ర సదానందం, తాటి అశోక్ గౌడ్, బట్టు సంపత్, టీజేఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడ హరీశ్రెడ్డి, టీబీజీకేఎస్ బ్రాంచ్ కమిటీ ఉపాధ్యక్షుడు కొక్కుల తిరుపతి, యూత్ నాయకులు బుర్ర రాజు, సింగనవేణి చిరంజీవి యాదవ్, మదన్మోహన్, మహేందర్, యుగేంద్రచారి పాల్గొన్నారు.