గిరిజన, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
ఘనంగా చంద్రకళ-చందర్ వివాహ రిసెప్షన్
వధూవరులకు దుస్తులు అందజేసిన మంత్రి
నర్సంపేట, మార్చి 25 : కల్యాణలక్ష్మి పథకం రూపకల్పనకు కల్పనే ప్రేరణ అయిందని, రాష్ట్రంలోని పేద ఆడబిడ్డలందరికీ ఈ పథకం ద్వారా సీఎం కేసీఆర్ ఆర్థికసాయం అందిస్తున్నారని గిరిజన, స్త్రీ, శిశు, సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శుక్రవారం నర్సంపేటలో కల్పన కుమార్తె చంద్రకళ- చందర్ల వివాహ రిసెప్షన్కు హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఇప్పటివరకు దాదాపు రూ.90 వేల కోట్లు కల్యాణలక్ష్మి పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. సీఎం కేసీఆర్కు మాత్రమే ఈ ఘనత దక్కుతుందన్నారు. ఈ పథకం డబ్బులు వృథా కావొద్దనే ఉద్దేశంతోనే వధువు తల్లి పేరుపై చెక్కును అందిస్తున్నామన్నారు. అన్నీ తామై పెళ్లిపెద్దగా సొంత ఖర్చులతో వివాహాన్ని జరిపించిన ఎమ్మెల్యే పెద్ది దంపతులు అభినందనీయులన్నారు. కాగా, నెక్కొండకు చెందిన వనప్రేమికుడు, గ్రీన్ ఇండియా చాలెంజ్ అవార్డు గ్రహీత నల్లగొండ సమ్మయ్య ఆధ్వర్యంలో మంత్రి సత్యవతి చేతుల మీదుగా నూతన దంపతులతో వేప మొక్క నాటించారు.
అలాగే, ఎమ్మెల్యే పెద్ది మాట్లాడుతూ.. ఇప్పటివరకు పది లక్షల మంది పేదింటి పెళ్లిళ్లకు కేసీఆర్ మేనమామలా కల్యాణలక్ష్మి పథకం ద్వారా ఆర్థికసాయం అందించారన్నారు. ఈ పథకాన్ని ప్రారంభించడానికి ప్రేరణగా నిలిచిన లూనావత్ కల్పన బిడ్డ చంద్రకళ -చందర్ వివాహానికి ఏ లోటు రాకుండా చూడాలని కేసీఆర్ తనకు చెప్పారన్నారు. కార్యక్రమంలో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్, మాజీ ఎంపీ సీతారాంనాయక్, బెల్లయ్యనాయక్, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు కత్తి వెంకటస్వామి, ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్, మున్సిపల్ చైర్పర్సన్ గుంటి రజినీకిషన్, ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామీనాయక్, జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.