వరంగల్ చౌరస్తా, మార్చి 25: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించ తలపెట్టిన రెండు రోజుల సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని టీఆర్ఎస్కేవీ విభాగం అధ్యక్షుడు భోగి సురేశ్, సీఐటీయూ నాయకుడు రామస్వామి, ఐఎఫ్టీయూ నాయకుడు దయాకర్ పిలుపునిచ్చారు. ఆల్ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం వరంగల్ రైల్వేస్టేషన్ నుంచి పోచమ్మమైదాన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశాన్ని కార్పొరేట్ వ్యవస్థకు దారపోస్తున్న కేంద్రాన్ని గద్దె దించేందుకు ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ శక్తులను ఎదుర్కొనేందుకు కార్మికులు సాధించుకున్న చట్టాలు, లేబర్ కోడ్లను రద్దు చేసేందుకు కేంద్రం పన్నాగం చేస్తున్నదని అన్నారు. ఈ కుట్రలను భగ్నం చేయడానికి ఈ నెల 28, 29వ తేదీల్లో దేశవ్యాప్తంగా నిర్వహించనున్న సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్కేవీ, సీఐటీయూ జిల్లా కార్యవర్గ సభ్యులు, ఐఎఫ్టీయూ నాయకులు పాల్గొన్నారు.
సార్వత్రిక సమ్మెలో పాల్గొనాలి
నల్లబెల్లి: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 28, 29వ తేదీల్లో నిర్వహించనున్న సమ్మెల్యే కార్మికులు పాల్గొనాలని ఏఐఎఫ్టీయూ(న్యూ) నేతలు పిలుపునిచ్చారు. రాష్ట్ర అధ్యక్షుడు మోడెం మల్లేశం ఆధ్వర్యంలో శుక్రవారం మండలకేంద్రంలో హమాలీ కార్మికులు నిరసన చేపట్టారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు, కార్పొరేటు శక్తులకు అప్పగించడం హేయమన్నారు. కార్యక్రమంలో ఈర్ల రాజు, శ్రీనివాస్, రమేశ్, మొగిలి, వెంకన్న, చంద్రమౌళి, ప్రశాంత్, రవి పాల్గొన్నారు.