సంగెం, అక్టోబర్ 18: హరితహారంలో కరెంటు వైర్ల కింద మొక్కలు నాటొద్దని ఎంపీపీ కందకట్ల కళావతి సూచించారు. చెట్లుగా మారిన తర్వాత విద్యుత్ తీగలకు తాకుతుండడంతో సిబ్బంది వాటిని నరికివేస్తున్నారని తెలిపారు. కరంట్ వైర్లకు దూరంగా మొక్కలు నాటడం వల్ల ఎవరికీ ఇబ్బందులు ఉండవన్నారు. మండల సర్వసభ్య సమావేశం మంగళవారం ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ అధ్యక్షతన జరిగింది. ముందుగా వివిధ శాఖల అధికారులు మూడు నెలల్లో జరిగిన ప్రగతిని సభలో చదివి వివరించారు. సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ కోనోకార్పస్ మొక్కల వల్ల ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారని, గ్రామ పంచాయతీలు తీర్మానం చేసి వాటిని తొలగించాలని సూచించారు. ఐకేపీ ఏపీఎం కిషన్ మాట్లాడుతూ మహిళా సంఘాలకు రూ. 20 లక్షల వరకు రుణం అందిస్తున్నట్లు చెప్పారు. మహిళలు జీవనోపాధి పొందేందుకు తక్కువ వడ్డీతో రుణాలు అందిస్తున్నామన్నారు. వడ్డీలేని రుణాలు 2018-19 సంవత్సరం వరకు వచ్చాయని తెలిపారు. పశువైద్యాధికారి రాజు మాట్లాడుతూ పశువుల్లో అమ్మతల్లి వ్యాధి ప్రబలుతుందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. నివారణకు టీకాలు ఇస్తున్నామని, త్వరలోనే మండలవ్యాప్తంగా పశువులకు అందజేస్తామని చెప్పారు. రెండో విడుత గొర్రెల పంపిణీని త్వరలోనే చేపడుతామని, గొల్లపల్లి, కృష్ణానగర్ గ్రామాలకు చెందిన సొసైటీ సభ్యులు తమ జాబితాను ఇప్పటి వరకు అందజేయలేదని, లబ్ధిదారులు లిస్టు అందించేలా స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. ఎంపీవో కొమురయ్య మాట్లాడుతూ మండలంలో రూ. 41 లక్షల వరకు ఇంటి పన్ను బకాయిలు ఉండగా, రూ. 23 లక్షల వరకు వసూలు చేశామని, త్వరలోనే వందశాతం పూర్తి చేస్తామని చెప్పారు.
ఆయిల్పాం మొక్కలు పెంచాలి
ఆయిల్పాం మొక్కలు పెంచి ప్రభుత్వ సబ్సిడీని వినియోగించుకోవాలని హార్టికల్చర్ అధికారులు సూచించారు. ఎంపీడీవో మల్లేశం మాట్లాడుతూ అర్హులందరికీ ఆసరా పింఛన్లు ఇస్తామని చెప్పారు. ఇంకా ఎవరైనా ఉంటే వారి వివరాలు తెలుసుకొని పరిశీలిస్తామన్నారు. ఆసరా పింఛన్ల కోసం అర్హుల జాబితాను ప్రజాప్రతినిధులు కార్యదర్శులకు అందించాలని కోరారు. ఎంపీపీ కళావతి మాట్లాడుతూ మన ఊరు-మనబడి కార్యక్రమంలోని పనులను వేగవంతం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. మండలంలోని ఎక్కువ జీపీలు జాతీయ పంచాయతీ అవార్డులు గెలుచుకునేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమవంతు సహాయ సహకారాలు అందించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. సభలో వైస్ ఎంపీపీ బుక్క మల్లయ్య, ఇన్చార్జి తహసీల్దార్ రాజేశ్వర్రావు, ఏవో సీహెచ్ యాకయ్య, ఏఈలు రమేశ్, వేణు, ఎంఈవో ఎన్ విజయ్కుమార్, సర్పంచ్లు, ఎంపీటీసీలు, అధికారులు పాల్గొన్నారు.