నెక్కొండ/చెన్నారావుపేట/ఖానాపురం/నల్లబెల్లి/నర్సంపేరూరల్, సెప్టెంబర్ 8: నెక్కొండ మండలంలో భారీ వర్షాలకు 15 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తహసీల్దార్ డీఎస్ వెంకన్న, నాయబ్ తహసీల్దార్ రాజ్కుమార్ తెలిపారు. బొల్లికొండలో డప్పు నర్సి, నునావత్ బీల్య, బానోత్ రామ్కోటి, బానోత్ నరేందర్, చిన్నకోర్పోలులో బానోత్ జ్యోతి, బానోత్ అమ్మి, నెక్కొండలో మహ్మద్ ఖాజా, రెడ్యాతండాలో ఆంగోత్ హనుమ, పెద్దకోర్పోలులో మునిగె వెంకటమ్మ, నాగారంలో చీపిరి నాగమ్మ, రెడ్లవాడలో రాయపురం రాజ్యమ్మ, మూడుతండాలో భూక్యా రాజమ్మ, గుండ్రపల్లిలో మనుబోతుల రమణారెడ్డి, సదరం కట్మమ్మ, దీక్షకుంటలో సూత్రపు వీరమ్మ ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు గుర్తించామన్నారు.
కాగా, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో నెక్కొండ మండలంలో వట్టెవాగు ఉధృతి బుధవారం తగ్గింది. నెక్కొండ-నర్సంపేట, నెక్కొండ-గూడూరు, నెక్కొండ-చంద్రుగొండ, పెద్దకోర్పోలు-చిన్నకొర్పోలు, నాగారం- ఇంటికన్నె మార్గాల్లో రాకపోకలను పునరుద్ధరించారు. చెన్నారావుపేట మండలంలోని చెరవుకొమ్ముతండా గ్రామ పంచాయతీ పరిధిలోని రోడ్లన్నీ బురదమయంగా మారాయి. సర్పంచ్ బోడ విజయాబద్దూనాయక్ గ్రామస్తులతో కలిసి పరిశీలించారు. కాగా, జల్లి గ్రామంలో పారిశుధ్య సమస్యలు తలెత్తుతున్నాయని, జీపీ పాలకులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇటీవల జీపీకి కేటాయించిన ట్రైసైకిల్ నిరుపయోగంగా ఉంది. గ్రామంలో రసాయనాలు పిచికారీ చేసే వారు కరువయ్యారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖానాపురం మండలవ్యాప్తంగా 10 ఇళ్లు కూలిపోయినట్లు తాసిల్దార్ జులూరి సుభాషిణి తెలిపారు. దబీర్పేట, బుధరావుపేట, బండమీదిమామిడితండా, మంగళవారిపేటలోని వంగ ఎల్లమ, బోడ భద్రమ్మ, బానోత్ శ్రీనుతోపాటు మరో ఏడు మట్టి, పెంకుటిళ్లు కూలినట్లు తెలిపారు. నల్లబెల్లి మండలంలో కల్వర్టుల పునరుద్ధరణకు కృషి చేయనున్నామని తాసిల్దార్ రోకుల పవన్కుమార్ తెలిపారు. ఆయన ప్రధాన రోడ్లపై ఉన్న కల్వర్టులు, నీట మునిగిన పంటలు, కూలిన ఇండ్లను పరిశీలించారు. మండలంలో 25 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.
నందిగామ, రేలకుంట, మేడపెల్లి, గొల్లపల్లె, కొండాపూర్, అసరవెల్లి నుంచి మండలకేంద్రానికి సంబంధాలు తెగిపోయాయన్నారు. బుధవారం 7.2 మిల్లీమీటర్ల వర్షం కురిసిందన్నారు. నష్టాన్ని అంచనా వేసి కలెక్టర్కు నివేదిస్తామన్నారు. నర్సంపేట మండలంలోని పలు గ్రామాల్లో ప్రధాన రహదారులు పాతముగ్ధుంపురం గ్రామ శివారు నర్సంపేట-నెక్కొండ ప్రధాన రహదారిలోని లోలెవెల్ కాజ్వే పూర్తిగా పాడైంది. సర్పంచ్ సుంకరి లావణ్య, కార్యదర్శి మహేశ్ ఆధ్వర్యంలో జీపీ సిబ్బంది తాత్కాలిక మరమ్మతులు చేపట్టారు. నర్సంపేట-గురిజాల, నర్సంపేట-నల్లబెల్లి ప్రధాన రహదారుల్లోని లోలెవెల్ కాజ్వేలు ఇటీవల కురిసిన వర్షానికి పూర్తిగా దెబ్బతిన్నాయి. మాదన్నపేటకు చెందిన ఎండీ సలీం ఇల్లు వర్షానికి పూర్తిగా కూలిపోయింది. సర్పంచ్ మొలుగూరి చంద్రమౌళి, ఎంపీటీసీ రాంబాబు, వార్డు సభ్యులు పరామర్శించారు.