హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 8 : అచల చిట్ఫండ్ ఏజెంట్ దంపతుల పెట్రోల్ దాడిలో తీవ్రంగా గాయపడిన పిట్టల రాజు మృతి చెందాడు. ఈనెల 3న హనుమకొండ కుమార్పల్లిలో రాజుపై అచల చిట్ఫండ్ ఏజెంట్ గణేశ్, అతడి భార్య కావ్య పెట్రోల్ పోసి నిప్పంటించగా తీవ్ర గాయాలపాలై హనుమకొండలోని మ్యాక్స్కేర్ దవాఖానలో చికిత్స పొందుతూ బుధవారం మృత్యువాత పడ్డాడు. చిట్టీ డబ్బుల కోసం నిలదీసిన పాపానికి ఏజెంట్ దంపతులు పెట్రోల్ పోసి నిప్పంటించిన విషయం తెలిసిదే. భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం పంగిడిపల్లికి చెందిన పిట్టల రాజు(30) బతుకుదెరువు కోసం సుమారు ఏడు సంవత్సరాల క్రితం హనుమకొండకు వచ్చి కుమార్పల్లిలో సెల్షాపు నడుపుతున్నాడు. స్టేషన్ఘన్పూర్కు చెందిన మానసను రాజు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఐదు సంవత్సరాల బాబు సాయిరిత్విక్ ఉన్నాడు. రాజు మృతి చెందిన విషయం తెలియగానే భార్య మానసతో పాటు తల్లి, అక్క బోరున విలపించారు.
మృతదేహాన్ని చూసేందుకు దవాఖానకు కుటుంబ సభ్యులు తరలివచ్చారు. కాగా, ఎలాంటి ఘటనలు జరుగకుండా హనుమకొండ సీఐ వేణుమాధవ్, ఎస్సైలు సీహెచ్.రఘుపతి, రాజ్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు బందోస్తు నిర్వహించారు. మృతదేహాన్ని బందోబస్తు మధ్య ఎంజీఎం దవాఖాన మార్చురీకి తరలించారు. న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ రాజు కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. రూ.20 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని భీష్మించుకుని కూర్చున్నారు. హనుమకొండ ఏసీపీ జితేందర్రెడ్డి, సీఐ వేణుమాధవ్ ఆధ్వర్యంలో అచల చిట్ఫండ్ యాజమాన్యంతో సంప్రదింపులు జరిపారు. అర్ధరాత్రి వరకూ చర్చలు జరుగగా, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
కొంపముంచిన చిన్ననాటి స్నేహం
పిట్టల రాజు-గొడుగు గణేశ్ చిన్ననాటి స్నేహితులు. ఒకే పాఠశాలతో పాటు చిట్యాలలోని జూనియర్ కళాశాలలో చదువుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. హనుమకొండ హంటర్రోడ్లో ఉంటున్న గణేశ్, అతడి భార్య కావ్య సలహా మేరకు రాజు అచల చిట్ఫండ్లో చిట్టీ వేశాడు. అయితే చిట్టీ ఎత్తుకున్నప్పటికీ సంస్థ నుంచి డబ్బులు రాకపోవడంతో రాజు నిలదీయగా గణేశ్, కావ్య ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టారని తెలిపారు.