గణపతిదేవుని కాలంలో నిర్మితమై.. రాణీ రుద్రమదేవితో ప్రత్యేక పూజలందుకున్న ‘ఏకవీరాదేవి’ ఆలయం కొలువైన మొగిలిచర్ల గ్రామం, మహా చరిత్రను తన కడుపున దాచుకున్నది. కాకతీయుల సైనిక స్థావరంగా ఉన్న ఈ ఊరు నాడే మహానగరంగా భాసిల్లింది. ఇక్కడ కొలువైన ఏకవీరాదేవి, జానపదుల నోట ‘ఓరుగంటి రేణుకామాత’గా ప్రాచుర్యం పొందింది. ఇప్పటికీ ఇక్కడ అడుగడుగునా కనిపించే అద్భుత శిల్ప సంపద, ఆధ్యాత్మికను పంచే ఆలయాలు నాటి చారిత్రక వైభవానికి అద్దం పడుతున్నాయి. ఓరుగల్లు కోటకు ఈశాన్యాన పుట్టకోట ఉత్తర ద్వారం వైపున్న మొగిలిచర్ల, చుట్టూ చేలూ.. చెలకలు.. కొండలు.. గుట్టలు, గొలుసుకట్టు చెరువులు.. కుంటలు, పచ్చని పంట పొలాలతో కూడిన ప్రకృతి అందాలతో ‘రారమ్మని’ పిలుస్తున్నది.
కాకతీయుల కాలంలో సైనిక స్థావరం
ఖిలావరంగల్, సెప్టెంబర్ 4 : విప్లవాల పురిటి గడ్డగా పేరున్న మొగిలిచర్ల గ్రామం ఘనమైన చారిత్రక విశిష్టతను కలిగి ఉన్నది. ఊరిలో ఏ రాయిని తట్టినా నాటి కాకతీయుల వైభవాన్ని కళ్లగడుతుంది. కాకతీయుల సామ్రాజ్యంలో మొగిలిచర్ల తన వంతు పాత్ర పోషించిందనేందుకు ఇక్కడి గుళ్లు, గోపురాలు, చారిత్రక ఆనవాళ్లే సజీవ సాక్ష్యాలుగా నిలిచాయి. గ్రామంలో ఎక్కడ చూసినా ప్రతి రాయి, రప్ప, భాగాలు తెగిపడిన శిల్పాలు చూపరులను నాటి కాలానికి తీసుకెళ్తాయి. కాకతీయుల ఏలుబడిలో మొగలిచర్ల సైనిక స్థావరంగా.. నాడే మహానగరంగా భాసిల్లిందనేందుకు ఇక్కడ అనేక చారిత్రక ఆనవాళ్లు కనిపిస్తాయి. వరంగల్ బస్స్టేషన్ నుంచి 8.1 కిలోమీటర్లు, వరంగల్ కోట నుంచి 6.1 కిలోమీటర్ల దూరంలో ఉన్న మొగిలిచర్లకు చేరుకునేందుకు అన్ని రకాల రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ గ్రామం గీసుగొండ మండలంలో ఉన్నా మహానగరపాలక సంస్థలో 15వ డివిజన్గా ఏర్పడింది.
ఊరి మధ్యలో శిల్పరాశులు
మొగిలిచర్లలో ఎటుచూసినా శిల్పరాశులు దర్శనమిస్తాయి. గ్రామ నడిబొడ్డున రోడ్డు పక్కన అనేక శిల్ప కళాఖండాలు చూపరులను ఆకర్షిస్తాయి. అందులో కాకతి, నాగప్రతిమలు, వీరగల్లులు, రెండు నందీశ్వర విగ్రహాలు, రెండు సూర్య విగ్రహాలు, లక్ష్మీనర్సింహస్వామి విగ్రహాలు, శాస నం, ద్వార పాలక, భైరవ విగ్రహాలున్నాయి.
రాతి గుహలు
ఏకవీరాదేవి ఆలయం ముందు ఐదు రాతి గుహలున్నాయి. సమీపంలో స్త్రీ శిల్పం చెక్కి ఉన్నది. ఆమె తన చేతిలో పడగ విప్పిన నాగుపామును, పాత్రను ధరించి ఉంది. ఎడమ చేతికింద రెండు పాములు, కుడి పాదం పక్కన నాగుపాము చెక్కి ఉన్నది. ఈ విగ్రహం విష హరిణి మానసాదేవిదని, మంత్ర సిద్ధిరాలిదని గ్రామస్తులు చెబుతున్నారు. గ్రానైట్ రాతిపై తొలిచిన గుహలున్నాయి. వీటి ప్రవేశ ద్వారాలు చిన్నివిగా ఉన్నా ఒక్కోదాంట్లో ముగ్గురు కూర్చొని ధ్యానం చేసేంత స్థలం ఉన్నది. గుహలో ప్రాణపట్టం.. బయటకు నీళ్లు వెళ్లేందుకు ప్రత్యేక డ్రైనేజీ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు.
తూర్పు చెరువు కట్ట వైపు అద్భుత నిర్మాణాలు
మొగిలిచర్లకు ఆనుకొని ఉన్న తూర్పు చెరువు కట్ట వద్ద పోచమ్మ ఆలయం ఉన్నది. ఆలయంలో చతుర్భుజ భైరవ విగ్రహంతో పాటు చిన్నచిన్న విగ్రహాలు, నాగప్రతిమలు, శాసనాలు, ఎనిమిది వీరగల్లు విగ్రహాలున్నాయి. వీరహస్తం నందు ఈటెలు, బరిసెలు, ధనుర్బాణాలు, బాకులు తదితర ఆయుధాలతో గంభీరంగా కనిపిస్తున్న వీరగల్లు విగ్రహం, గుడి సమీపంలో మాలపోచమ్మ ఆలయం ఉన్నాయి. ఈ గుడిలో చతర్భుజాలతో దుర్గాశక్తి దేవతామూర్తి చేతిలో ఢమరుకం, ఖడ్గం, త్రిశూలం, పానపాత్ర ఉంది. తూర్పు చెరువులో మిషన్ కాకతీయలో భాగంగా పూడికతీత పనులు చేపట్టిప్పుడు పలు దేవతా విగ్రహాలు బయట పడ్డాయి.
ఇదీ చారిత్రక నేపథ్యం
ఓరగల్లు కోటకు ఈశాన్య భాగాన సుమారు ఆరు కిలోమీటర్ల దూరంలో మొగిలిచర్ల ఉంది. నాటి ఓరుగల్లును ఏకశిలానగరంగా వ్యవహరించినట్లే మొగిలిచర్లను కూడా ‘కేతకీ తటాకపురం’ అని పిలిచేవారు. ఈ గ్రామ సమీపంలో మొగలిపొదలు దట్టంగా వ్యాపించి ఉండడం, సమీపాన ఉన్న చెరువులో విరివిగా పూసే మొగలి పూలతో నిత్యం కాకతీయులు ఇక్కడ కొలువైన ఏకవీరాదేవికి పూజలు చేయడం వల్ల ఊరికి మొగలిచర్ల.. మొగిలిచర్ల అనే పేరు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. కాకతీయ చక్రవర్తి గణపతిదేవ మహారాజు నిర్మించిన ఏకవీరాదేవి (రేణుకామాత) ఆలయంలో ఆయన కూతురు రాణీ రుద్రమదేవి ప్రత్యేకంగా పూజలు చేసేందుకు ఇక్కడికి వచ్చేది. ఏకవీరాదేవిని అర్తించి పూజించేందుకు నెలలో ఐదు రోజుల పాటు ఆమె ఇక్కడే గడిపినట్లు సిద్ధేశ్వర చరిత్రలో లిఖితమై ఉన్నది.
ఇదే విషయం ఏకాంబ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్రలోనూ ఉన్నది. రుద్రమదేవి కూతురు ముమ్మడమ్మ గర్భిణిగా ఉన్నప్పుడు మొగిలిచర్లలో మూడు రోజుల పాటు ఏకవీరాదేవి ఆలయంలో వ్రతం చేయాలని మంత్రి శివదేవయ్యకు ఆదేశాలు జారీ చేసినట్లు చరిత్ర చెబుతున్నది. మొగిలిచర్లకు వచ్చిన రుద్రమదేవిని మట్టుబెట్టేందుకు హరిహర మురహరిదేవులు కుట్ర పన్నగా వేగుల ద్వారా విషయం తెలుసుకున్న రుద్రమదేవి మొగలిచర్లలోనే వారిని అంతమొందించినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు.
బల్లపరుపు బండపై ఏకవీరాదేవి ఆలయం
ఊరికి వాయువ్య భాగాన పచ్చని చేల మధ్య బల్లపరుపు బండపై ఏకవీరాదేవి (రేణుకాదేవి) ఆలయం ఉంది. దాని ముందు కూలి పడిపోయిన మహాద్వారం ఆనవాళ్లున్నాయి. ఆలయ పైకప్పు 28 రాతి స్తంభాలపై నిలిచి ఉంది. ఆలయంలో నాట్యమండపం, గర్భాలయంలో ప్రత్యేకమైన రెండు స్తంభాలతో పాటు అంతరాలయం ఉంది. ఆలయంలో నాటి ఏకవీరాదేవి విగ్రహం లేదు. కానీ గర్భగుడిలో కుండలాలు, కంఠాభరణాలు, దండికడియాలు ధరించి చతర్భుజాలతో ఉన్న అద్భుత స్త్రీదేవతా ప్రతిమ ఉన్నది. కుడి ముంజేత ఖడ్గం, వెనుక కుడిచేత ఢమరుకం, ఎడమ చేత పానపాత్ర, వెనుక ఎడమచేత త్రిశూలంతో గంభీరంగా కనిపిస్తుంది. అయితే జానపద కళాకారులు తమ గేయాల్లో ఏకవీరాదేవిని ‘ఓరుగంటి రేణుకాదేవి’గా ప్రచారం చేసినట్లు తెలుస్తున్నది.
అద్భుత ఆలయాలు.. శిల్పసంపద
ఓరుగల్లు కోటకు ఈశాన్య భాగాన పుట్టకోట ఉత్తర ద్వారం వద్ద ఉన్న మొగిలిచర్ల ప్రకృతి అందాలు నెలవైంది. చుట్టూ చేలు.. చెలకలు, దూరంగా కొండలు.. గుట్టలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. గ్రామానికి తూర్పు, పశ్చిమం, ఉత్తరాన మూడు గొలుసుకట్టు చెరువులు, కుంటలు కనువిందు చేస్తున్నాయి. ఊరిలోకి ప్రవేశించగానే మొదటి పశ్చిమ చెరువు ఆ పక్కనే కాకతీయులు కట్టించిన శివాలయం దర్శనమిస్తుంది. అందులో శివలింగం, మూడు నందీశ్వర విగ్రహాలు, వినాయకుడు, ఆంజనేయ విగ్రహాలున్నాయి. ఖడ్గం, బాకు, మానవ శిరస్సు, పాత్రతోపాటు జడలతో నిలుచొని ఉన్న స్త్రీ దేవతావిగ్రహం ఉన్నది. ఆలయం గోడ పైభాగాన మొసళ్లు, జింకలు, ఏనుగుల విగ్రహాలున్నాయి.
అతిపెద్ద భైరవ విగ్రహం
ఏకవీర ఆలయం దారిలోనే అతిపెద్ద భైరవ విగ్రహం ఉన్నది. రాతి ఫలకపై నగ్నంగా చెక్కి ఉన్న ఈ విగ్రహం తలపై జడలు, కోరలు, వికృత ముఖం, రెండు చేతుల్లో కత్తి, రక్తపాత్రతో భయంకరంగా ఉంటుంది. దీనికి దగ్గరగా ఒక బావి సమీపాన నేలలో కూరుకుపోయిన మరో స్త్రీ విగ్రహం అత్యంత సుందరంగా ఉంది.
వేణుగోపాల స్వామి ఆలయం
మొగిలిచర్లలోకి అడుగుపెట్టే ప్రధాన ప్రవేశ ద్వారానికి సమీపంలో వేణుగోపాల స్వామి ఆలయం ఉంది. అదే ప్రాంగణంలో లక్ష్మీనర్సింహ స్వామి విగ్రహ శకలాలున్నాయి. ఆలయ ప్రవేశ ద్వారం రెండంతస్తుల మండపం కింది నుంచి ఉంది. ప్రవేశ ద్వారం గోడకు సప్తమాత్రుకలు, ఉగ్రరూపం దాల్చిన రెండు సింహాల విగ్రహాలున్నాయి. గ్రామానికి తూర్పున కాకతీయులు నిర్మించిన రాతి మండపం కింద భక్తాంజనేయస్వామి భక్తులకు దర్శనమిస్తుంటాడు.
వెలుగులోకి రాని శాసనాలు
మొగిలిచర్లలో నాలుగు శిలాశాసనాలున్నాయి. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ శిథిలమవుతున్న ఈ శాసనాలను భద్రపరిచి వాటిపై రాసి ఉన్న విశిష్టతను తెలుసుకుంటే మొగిలిచర్ల ప్రాశస్త్యం వెలుగులోకి వచ్చే అవకాశముందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. కాకతీయుల సామ్రాజ్యంలో సైనిక స్థావరంగా నిర్మితమైన మొగిలిచర్ల చరిత్రను పరిశోధించి భావితరాలకు అందించాలని వారు కోరుతున్నారు.