మనీష్, సోనియానాయుడు, ప్రీతి హెస్సోనా ప్రధాన పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘రెటీనా’. అల్లం రాజు దర్శకుడు. పార్వతి నిర్మాత. ఈ చిత్రం ప్రారంభోత్సవం ఆదివారం హైదరాబాద్లో జరిగింది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ దర్శక,నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ క్లాప్ ఇవ్వగా, ‘రజాకార్’ దర్శకుడు యాట సత్యనారాయణ కెమెరా స్విచాన్ చేశారు. ‘కమిటీ కుర్రోళ్లు’ఫేం యశ్వంత్ పెండ్యాల గౌరవ దర్శకత్వం వహించారు.
తదనంతరం అతిథులంతా చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ‘భావోద్వేగాలతో కూడుకున్న కథ ఇది. నిజజీవిత సంఘటనలు ఇందులో ఉంటాయి. ప్రేక్షకులకు గొప్ప అనుభూతినిచ్చేలా సినిమాను తెరకెక్కిస్తాం’ అని దర్శకుడు అల్లం రాజు చెప్పారు. యోగికత్రి, సతీశ్, పూ జిత, విజయలక్ష్మి, కేవీఎల్ నరసింహారావు తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రవి కె.రెడ్డి, సంగీతం: రాకేష్.