వరంగల్, సెప్టెంబర్ 4 : గ్రేటర్ కార్పొరేషన్ పరిధిలో పారిశుధ్యం పక్కాగా నిర్వహించాలని బల్దియా కమిషనర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. శనివారం నగరంలోని ప్రధాన రహదారులతో పాటు పోతన నగర్, బాలసముద్రం చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్లను తనిఖీ చేశారు. ముందుగా హన్మకొండ చౌరస్తా నుంచి ప్రధాన రహదారుల్లోని పారిశుధ్య వ్యవస్థను పరిశీలించారు. అక్కడి నుంచి పోతన చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ను వెళ్లారు. అక్కడి లాక్బుక్ను తనిఖీ చేసి, చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ నిర్వహణ సమర్థవంతంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ట్రాన్స్ఫర్ స్టేషన్లోని పొదలను తొలగించాలన్నారు. పారిశుధ్య సిబ్బంది తప్పనిసరిగా యూనిఫాం ధరించాలన్నారు. అనంతరం అక్కడి నుంచి హంటర్ రోడ్డు, ఉర్సు బైపాస్ రోడ్డు, రంగశాయిపేట మీదుగా బాలసముద్రం టాన్స్ఫర్ స్టేషన్కు వెళ్లి తనిఖీ చేశారు. కమిషనర్ వెంట చీఫ్ ఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, శానిటరి ఇన్స్స్పెక్టర్లు శ్యామ్రాజ్, అనిల్ తదితరులు ఉన్నారు.
చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ను తరలించాలి..
పోతన చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ను తరలించాలని పోతన నగర్ కాలనీవాసులు కమిషనర్ ప్రావీణ్యను కోరారు. చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ తనిఖీకి వచ్చిన ఆమెను కాలనీ వాసులు కలిసి ఈమేరకు విన్నవించారు. చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ జనావాసాల మధ్య ఉండడంతో ఇబ్బందులు పడుతున్నామని, దుర్వాసన వస్తోందని, విష పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానికులు కమిషనర్కు వివరించారు. గతంలో ఇదే స్థలంలో రూ. 2 కోట్లతో కమ్యూనిటీ హాల్ నిర్మించేందుకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. స్థానిక టీఆర్ఎస్ నాయకుడు దేవరకొండ సురేందర్, స్థానికులు పాల్గొన్నారు.
గురుపూజోత్సవానికి ఆహ్వానం
హనుమకొండ డీఈవో నారాయణరెడ్డి గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్యను తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమొక్క అందజేశారు. ఈనెల 5న గురుపూజోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో నిర్వహించే కార్యాక్రమానికి రావాలని ఆహ్వానం అందించినట్లు ఆయన తెలిపారు. అలాగే, టీఎస్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ విజయభాస్కర్ కమిషనర్ను కలిసి పూల మొక్క అందజేశారు. ఆయనతో పాటు ఆర్టీసీ డివిజనల్ మేనేజర్లు వీ శ్రీదేవీ, టీ శ్రీనివాసరావు ఉన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు కమిషనర్కు పూల మొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలిసిన వారిలో టీఆర్ఎస్కేవీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు బోగి సురేశ్, గ్రేటర్ కార్పొరేషన్ అధ్యక్షుడు గాదె కుమారస్వామి, ప్రతినిధులు కొత్తకొండ శ్రీనివాస్, ఓరుగంటి జీవన్, పడాల రామ్మూర్తి, చెరుకు సుధాకర్, నద్దునూరి రాజేశ్ఖన్నా, ఎల్ వెంకట్, మేకల సమ్మయ్య, పాశం రవి, ఆడేపు సత్యనారాయణ ఉన్నారు.
‘కుడా’ వైస్ చైర్పర్సన్గా కమిషనర్కు అదనపు బాధ్యతలు
కాకతీయ పట్ణణాభివృద్ధి సంస్థ వైస్ చైర్పర్సన్గా గ్రేటర్ కార్పొరేషన్ కమిషనర్ ప్రావీణ్యకు ఆదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు మున్సిపల్శాఖ శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేటర్ కమిషనర్ కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్గా విధులు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. ఆదే క్రమంలో కమిషనర్ ప్రావీణ్యకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ కార్యదర్శి సుదర్శన్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న కమిషనర్
భద్రకాళి అమ్మవారిని గ్రేటర్ కమిషనర్ ప్రావీణ్య శనివారం దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాలి శేషు పూర్ణకుంభంతో స్వాగతం పలికా రు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ మహామండపం లో అమ్మవారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు. అనంతరం ఆలయ చరిత్రను వివరించారు. తొలుత కమిషనర్ జగద్గురు ఆదిశంకరాచార్యులు, వల్లభ గణపతిని దర్శించుకున్నారు. కమిషనర్ వెంట ఆలయ సూపరింటెండెంట్ అద్దంకి విజయ్కుమార్, హరినాథ్, కృష్ణ, చింత శ్యాంసుందర్ ఉన్నారు.