వర్ధన్నపేట, మే 8: విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలంలోని ఇల్లంద మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆదివారం ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు కలెక్టర్ గోపితో కలిసి శంకుస్థాపన చేశారు.
అనంతరం సర్పంచ్ సుంకరి సాంబయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో వైద్య, విద్యారంగాల ప్రగతి కోసం సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. పేద కుటుంబాల పిల్లలు ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను సద్వినియోగం చేసుకుని విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్కు దీటుగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇల్లందలో ఇప్పటికే రూ.3కోట్లతో సీసీ రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. త్వరలోనే చెరువులను అభివృద్ధి చేస్తామన్నారు.
‘మన ఊరు – మనబడి’ కార్యక్రమంలో భాగంగా మొదటి విడుతలో జిల్లాలో 223 ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తామని కలెక్టర్ గోపి తెలిపారు. ఈ పాఠశాలల్లో 12 అంశాల వారీగా పనులు ప్రారంభించేందుకు ఇంజినీరింగ్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారని వివరించారు. ఇల్లంద ప్రాథమిక పాఠశాలకు రూ.47లక్షలు, ఉన్నత పాఠశాలకు రూ.63 లక్షలు కేటాయించినట్లు చెప్పారు.
ఈ నిధులతో విద్యార్థులకు అవసరైన అన్ని వసతులు కల్పిస్తామని తెలిపారు. 3 విడుతల్లో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేస్తామన్నారు. అడిషనల్ కలెక్టర్లు హరిసింగ్, శ్రీవత్స కోట, డీఈవో వాసంతి, జడ్పీటీసీ మార్గం భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ రాజేశ్ఖన్నా, ఆత్మ చైర్మన్ గోపాల్రావు, ఎంఈవో రంగయ్య, ఎంపీటీసీలు గొడిశాల శ్రీనివాస్, పిట్టల జ్యోతి, ఎస్ఎంసీ చైర్మన్ కుమారస్వామి, ఉపసర్పంచ్ రాజ్కుమార్
పాల్గొన్నారు.