కేసముద్రం / నెల్లికుదురు, నవంబర్ 29: ధాన్యం రైతులకు తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటూ, మద్దతు కొనుగోలు చేస్తుందని ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ అన్నారు. సోమవారం ఆయన కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి, ధన్నసరి, నెల్లికుదురు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ధాన్య కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. గత పాలకులు వ్యవసాయ రంగాన్ని విస్మరిస్తే, సీఎం కేసీఆర్ అధికారంలోకి వచ్చాక వ్యవసాయానికి అధిక నిధులు కేటాయించి పండుగలా మార్చాడని అన్నారు. రైతుబంధు, బీమా, రుణమాఫీ వంటి పథకాలకు రైతులకు ఆర్థికంగా ప్రయోజనం కలిగిస్తున్నాయన్నారు. రైతులు పండించిన ప్రతిగింజ ధాన్యపు గింజనూ ప్రభుత్వం కొంటుందని, ఆందోళన చెందొద్దన్నారు.
ఆరబెట్టిన నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవొద్దని,కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తాలు, తేమ పేరుతో ధాన్యం బస్తాల్లో కోతవిధిస్తే చర్యలు తప్పవని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను హెచ్చరించారు. కాంటాలు, ట్రక్ షీట్ల వివరాలను ఆన్లైన్ చేసి, రెండు రోజుల్లో డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాలో జయ్యే విధంగా చూడాలన్నారు. కేసముద్రం మండలంలోని కల్వల, అన్నారం, కాట్రపల్లి, కోమటిపల్లి గ్రామాల్లో కూడా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
కేసముద్రంలో మార్క్ఫెడ్ రాష్ట్ర డైరెక్టర్ మర్రి రంగారావు, జడ్పీటీసీ రావుల శ్రీనాథ్రెడ్డి, డీసీవో కుర్షిత్, రైతుబంధు సమితి మండల కో ఆర్డినేటర్ ప్రవీణ్కుమార్, ఆత్మ చైర్మన్ పోలెపల్లి నెహ్రూరెడ్డి, మండల అధ్యక్షుడు నజీర్ అహ్మద్, వైస్ ఎంపీపీ రావుల నవీన్రెడ్డి, నాయకులు రవిచందర్రెడ్డి, కముటం శ్రీను, హరీశ్నాయక్, వీరూనాయక్, రమేశ్, ఆగె వెంకన్న, సర్పంచ్లు గంట సంజీవరెడ్డి, రావుల విజిత, నీలం యాకయ్య, ఏవో వెంకన్న, సీఈవోలు గోపాల మల్లారెడ్డి, వెంకటాచలం, నెల్లికుదురులో తొర్రూరు ఏఎంసీ చైర్మన్ శాంత, వైస్ చైర్మన్ కసరబోయిన విజయ్, సర్పంచ్ యాదగిరిరెడ్డి, మండల అధ్యక్షుడు పరుపాటి వెంకట్రెడ్డి, వైస్ ఎంపీపీ జెల్ల వెంకటేశ్, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ యాసం రమేశ్, శ్రీరామగిరి సొసైటీ చైర్మన్ గుండా వెంకన్న, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు బత్తిని అనిల్, నెల్లికుదురు సొసైటీ సీఈవో యాదగిరి తదితరులు పాల్గొన్నారు.