మహబూబాబాద్, ఏప్రిల్ 21(నమస్తే తెలంగాణ) /మహబూబాబాద్: టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ దారుణ హత్యకు గురయ్యాడు. పట్టపగలే నడిరోడ్డుపై కాపుకాచి ట్రాక్టర్తో గుద్ది.. గొడ్డళ్లతో నరికి చంపారు దుండగులు. గురువారం మధ్యాహ్నం పట్టణంలోని పత్తిపాక రోడ్డులో జరిగిన ఈ ఘటనతో మానుకోట ఒక్కసారిగా ఉలిక్కిపడింది. వివరాల్లోకి వెళితే.. మహబూబాబాద్ పట్టణానికి చెందిన బానోత్ రవికుమార్(35) 2020 జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 8వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అప్పటి నుంచి పార్టీలో చురుగ్గా పనిచేస్తున్నాడు. కాగా, రవికుమార్ గురువారం ఉదయం 10గంటల వరకు స్థానికంగా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎంపీ, జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవితతో కలిసి పాల్గొన్నారు. అనంతరం పని నిమిత్తం ద్విచక్రవాహనంపై మున్సిపల్ కార్యాలయానికి వెళ్లాడు. అక్కడి నుంచి టింబర్ డిపోకు వెళ్లి, తిరిగి బాబూనాయక్ తండాలోని తన ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో మార్గమధ్యంలో పక్కాప్లాన్ ప్రకారం మాటువేసిన దుండగులు ముందుగా రవికుమార్ వస్తున్న ద్విచక్రవాహన్ని ట్రాక్టర్తో ఢీకొట్టారు. దీంతో బైక్తోపాటు అతడు 15 మీటర్ల దూరంలో పడ్డారు.
అప్పటికే కారులో ఉన్న ముగ్గురు వ్యక్తులు రోడ్డుపై పడి ఉన్న రవికుమార్ తల ముందు, వెనుక భాగంలో అతికిరాతకంగా గొడ్డలితో నరికి పరారయ్యారు. రోడ్డుపై కొన ఊపిరితో రక్తపుమడుగులో కొట్టుమిట్టాడుతున్న రవికుమార్ను గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. జిల్లా వైద్యశాలకు తరలించి చికిత్స అందించే క్రమంలో మృతి చెందాడు. రవికుమార్కు భార్య పూజ, ఇద్దరు కూతుళ్లు, కొడుకు ఉన్నారు. పెద్దకూతురు లావణ్య 10వ తరగతి, చిన్న కూతురు ఉష 7వ తరగతి, కొడుకు ధీరజ్నాయక్ మూడో తరగతి చదువుతున్నారు. మృతి వార్త తెలుసుకున్న ఎంపీ మాలోత్ కవిత వెంటనే జిల్లా వైద్యశాలకు చేరుకుని మార్చురీలో ఉన్న రవికుమార్ మృతదేహాన్ని చూసి బోరుమన్నారు. ‘ఇంతసేపు నా తోటే ఉంటివి కదా.. తమ్మీ.. అంటూ విలపించారు. ఎమ్మెల్యే బానోత్ శంకర్నాయక్ రవికుమార్ మృతదేహాన్ని చూసి కంటతడి పెట్టారు. కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి వ్యక్తం చేశారు. రవి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. నిందితులు ఎంతటివారైనా వదిలిపెట్టేది లేదని, త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులను ఆదేశించారు.
ఇద్దరు నిందితులను గుర్తించాం: ఎస్పీ
ఈ ఘటనపై ఎస్పీ శరత్చంద్రపవార్ మాట్లాడుతూ.. గురువారం ఉదయం 11.30 నుంచి మధ్యా హ్నం 12గంటల ప్రాంతంలో కౌన్సిలర్ రవికుమార్ను కొందరు దుండగులు కారులో వచ్చి తలపై గొడ్డలితో నరికినట్లు తెలిపారు. 108 వాహనంలో జిల్లా వైద్యశాలకు తీసుకెళ్లగా, చికిత్స అందించే క్రమంలోనే మృతిచెందాడని చెప్పారు. ఈ ఘటనకు కారకులైన ఇద్దరు నిందితులను గుర్తించామని, త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. రవికుమార్కు మరో వ్యక్తి మధ్య వ్యాపార లావాదేవీల్లో విభేదాలు రావడంతో కక్షపెట్టుకుని హతమార్చినట్లు ప్రాథమికంగా నిర్ధారించామన్నారు. ఇందులో రాజకీయ నాయకుల ప్రమేయం లేదని స్పష్టం చేశారు. అడిషనల్ ఎస్పీ యోగేశ్గౌతమ్, డీఎస్పీ సదయ్య, రూరల్ సీఐ రవికుమార్, టాస్క్ఫోర్స్ సీఐ వెంకటరత్నంతో నాలుగు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రంగంలోకి దింపామన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుని విచారించిన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని ఎస్పీ తెలిపారు.
దోషులను కఠినంగా శిక్షిస్తం: మంత్రి సత్యవతి
మహబూబాబాద్: కౌన్సిలర్ బానోత్ రవికుమార్ను హత్య చేసిన దుండగులను వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం ఆమె జిల్లా వైద్యశాలలోని మార్చురీలో రవికుమార్ మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. రవికుమార్ను దారుణంగా హత్య చేసిన నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని పోలీసులు ఆదేశించామన్నారు. పూర్తిస్థాయిలో సమీక్షించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడుతామన్నారు. ఫాస్ట్ట్రాక్ కోర్టులో తీర్పువచ్చేలా చూస్తామని చెప్పారు.
నాతో వచ్చిఉంటే బతికేవాడు
ఉదయం 10 గంటల సమయంలో 22వ వార్డులో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన సమయంలో రవికుమార్ నాతోనే ఉన్నాడు. శంకుస్థాపన తర్వాత తొర్రూరు, నర్సింహులపేట, దంతాలపల్లిలో జరిగే వివిధ కార్యక్రమాలకు నాతో రావాలని అడిగాను. కొత్త ఇంటి నిర్మాణం కోసం తలుపులు, కిటికీలకు టేకు కర్ర కావాలి.. ఆ పని చూసుకుంటానని చెబితే సరే అన్నాను. కానీ, గంటల వ్యవధిలోనే హత్యకు గురవ్వడం కలిచి వేసింది. రవికుమార్ కుటుంబాన్ని ఆదుకుంటా. మంచి కౌన్సిలర్ను కోల్పోయాం.
– ఎంపీ మాలోత్ కవిత