బచ్చన్నపేట : ధాన్యం కొనుగోళ్లు కేంద్రాలకు వచ్చే ధాన్యాన్ని వెంటవెంటనే తరలించి రైతులు ఇబ్బందులు పడకుండా అధికారులు కృషి చేయాలని జనగామ జిల్లా కలెక్టర్ శివలింగయ్య ఆదేశించారు. సోమవారం మండలంలోని తమ్మడపల్లి, బచ్చన్నపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రానికి రైతుల తీసుకొచ్చిన ధాన్యాన్ని కాంటా వేసి వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని, అదే విధంగా ట్రక్షీట్ను నమోదు చేయాలన్నారు. అకాల వర్షానికి ధాన్యం తడువకుండా ఉండేందుకు టార్ఫాలిస్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని చర్యలు కేంద్రం నిర్వాహకులు, సంబంధిత అధికారులు చూసుకోవాలన్నారు. కేంద్రానికి వచ్చిన ధాన్యాన్ని వెంట వెంటనే లారీల్లో తరలించేలా ఏర్పాట్లు చేయాలన్నారు. ధాన్యానికి సరిపడా లారీలు తెప్పించాలన్నారు. అనంతరం తమ్మడపల్లిలోని కొనుగోలు కేంద్రం వద్ద ఆయన రైతులతో మాట్లాడారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా హామాళీలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. శీతకాలం అయినందున, సాయంత్రం తొందరగా చీకటి పడుతున్నందున కేంద్రాల వద్ద లైటింగ్ సౌకర్యం కల్పించాలన్నారు. రైతులకు తాగునీటి వసతి కల్పించాలన్నారు.
ప్రతీ రైతుకు గిట్టుబాటు ధర కల్పించేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్నారు. రైతులు తెచ్చే ధాన్యంకు సరిపడా గన్నీ సంచులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ఆయన వెంట అదనపు జేసీ భాస్కర్రావు, సివిల్ సప్లయి జిల్లా అధికారి కిరణ్కుమార్, తాసిల్దార్ శైలజ, ఏపీఎం జ్యోతి, పీఏసీఎస్ వైస్ చైర్మన్ బేజాడి సిద్ధులు, గ్రామ సర్పంచ్ మేకల కవితరాజు, కేశిరెడ్డిపల్లి ఎంపీటీసీ సభ్యులు కర్ణాల వేణుగోపాల్, భగత్రెడ్డి, సీసీలు పాల్గొన్నారు.