జనగామ చౌరస్తా, నవంబర్ 27 : రైతుల సంక్షేమాన్ని విస్మరించిన కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం పంటలకు కనీస మద్దతు ధరలు పెంచకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారని రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోకు కనకారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు జరుగుతున్న తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర 2వ మహాసభలకు రైతు సంఘం జిల్లా నాయకులు ఆదివారం ప్రత్యేక బస్సుల్లో తరలి వెళ్లారు. జిల్లా కేంద్రంలోని నెహ్రూపార్కు ఏరియా వద్ద రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోకు కనకారెడ్డి జెండా ఊపి ప్రత్యేక బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్లను కార్పొరేట్ల చేతిలో పెట్టడానికే ఈ-నామ్ విధానం తీసుకొచ్చారని ఆరోపించారు. ఎరువుల సబ్సిడీ తగ్గించడానికి ప్రధాని నరేంద్రమోదీ పీఎం ప్రణామ్ పథకాన్ని తీసుకొచ్చారని పేర్కొన్నారు. విత్తన పరిశోధనలను పూర్తిగా విరమించి ఇతర దేశాల నుంచి బహుళజాతి సంస్థల టెక్నాలజీని దిగుమతి చేసుకుంటున్నారని ఆయన విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో వ్యవసాయ యాంత్రీకరణ చార్జీలు పెరిగాయని ఆయన చెప్పారు. ప్రైవేట్ వ్యాపారుల వల్ల రైతులు వరి, పత్తి, పప్పు ధాన్యాలు, నూనె గింజల అమ్మకంలో ఏటా రూ.5 వేల కోట్లు నష్టపోతున్నారని తెలిపారు. రైతుల సమస్యలను రాష్ట్ర మహాసభలో చర్చించి భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేస్తామని కనకారెడ్డి అన్నారు. కౌలు, పాలు, మహిళా, పత్తి, చెరకు రైతులు రాష్ట్రం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పాల్గొంటారని కనకారెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మంగ వీరయ్య, సహాయ కార్యదర్శి మీట్యానాయక్, భవాని, పుల్లయ్య, భిక్షపతి, లక్ష్మీనర్సింహారెడ్డి, కరుణాకర్, రాములు, శివ, ప్రసాద్, గణేశ్, అయోధ్య, సత్తిరెడ్డి, యాదగిరి, మల్లేశ్, వెంకన్న, శంకర్, నరేశ్, భూపాల్, కృష్ణమూర్తి, యాకయ్య, రాజు, సోమనర్సయ్య, మైబెల్లి, సిద్ధిమల్లయ్య, మల్లయ్య, రాము, బీరయ్య, ధర్మయ్య, ఈదురాములు, సాయిలు, సిద్ధులు, పరశురాములు, నర్సయ్య, రమేశ్, యాదగిరి, గట్టయ్య, సత్తయ్య, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.